ఖమ్మం రూరల్, జూలై 22 : న్యాయస్థానం నుండి తుది తీర్పు వెలువడిన తర్వాతే జాతీయ రహదారి పనులు చేపట్టాలని సాగు రైతులు మరోసారి నిరసన గళం వినిపించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్- తారేడు గ్రామాల మధ్య ఎన్హెచ్ఏఐ అధికారులు సర్వే చేపట్టారు. పోలీస్ అధికారులతో అధికారులు. సిబ్బందితో కలిసి ఫీల్డ్ మీదికి వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలోనే తాము న్యాయస్థానాన్ని సంప్రదించడం జరిగిందని, ఈ నెల 28వ తేదీన న్యాయస్థానం తుది తీర్పు వెలువరించడం జరుగుతుందని అనంతరం రహదారి పనులు చేపట్టాలని రైతులు తేల్చి చెప్పారు. అమరావతి టు నాగపూర్ సంబంధించి కల్లూరు నుంచి మంగళగూడెం వరకు సుమారు 119 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని తెలిపారు.
అందులో బాగానే కామంచికల్ గ్రామం నుంచి సైతం 19 మంది రైతులు ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇటీవలే కోర్టులో వాదనలు కూడా జరిగాయని తుది తీర్పు రాకముందే బుల్లోజర్లతో వచ్చి పంట పొలాలను నాశనం చేయడం సరి కాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫీల్డ్ మీదికి రావడం జరిగిందని ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితిని గమనించిన అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రహదారి పనులను మొదలుపెట్టారు. దీంతో ఆమంచికల్- డోర్నకల్ ప్రధాన రహదారిపై ఉదయం నుండి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.