హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి వరుసగా అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ, ఈ ఏడాది కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్స్నిల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం టీఎస్పీఎస్సీ, టీఆర్ఈఐఆర్బీ (ట్రిబ్), ఎంహెచ్ఎస్ఆర్బీల పరిధిలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 11, 12, 13, 14, 15, 16, 17లను జారీ చేసింది. ఆ వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఉద్యోగార్థులకు మరో శుభవార్త..సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేరుస్తున్నది’ అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఉద్యోగాల్లో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. వీటిని గురుకులాల నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇందులో 480 డిగ్రీ లెక్చరర్లు, 324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 ఆర్ట్, క్రాఫ్ట్,మ్యూజిక్ టీచర్, 30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, 33 పీఈటీ, 10 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. మరో 63 స్టాఫ్ నర్స్ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్ -3లో 12, గ్రూప్ -4 కింద 141 చొప్పున జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, 6 ఆర్ట్,క్రాఫ్ట్,మ్యూజిక్ టీచర్ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. సమాచార, పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో 4 పీఆర్వో, 16 ఏపీఆర్వో, 82 పబ్లిసిటీ అసిస్టెంట్, 41 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ , 22 ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది.