హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ చానల్తో మాట్లాడుతూ వింత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పంపిన బిల్లులను ఎందుకు ఆమోదించలేదు? అన్న జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తనకు కొంత సమయం కావాలని ప్రభుత్వానికి చెప్పానని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా బిల్లులు చేసి పంపారని చెప్పుకొచ్చారు.
పురపాలక చట్ట సవరణ బిల్లును మీ దగ్గరికి పంపి ఐదునెలలవుతుంది కదా, దీనిపై ఏమంటారని జర్నలిస్టు మరో ప్రశ్న సంధించారు. దీంతో ఖంగుతిన్న గవర్నర్ ఐదు నెలలుగా ఆపిన మాట వాస్తవమేనని, తనకు టైమ్ లిమిట్ లేదని, ఆపే అధికారం తనకు ఉన్నదని సమాధానమిచ్చారు. పైగా ‘అందులో ప్రజా ప్రయోజనం దాగున్నదో లేదో తెలుసుకోవాలి. అందుకే మరింత సమయం కావాలని అడిగాను’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక బిల్లుతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా? లేదా? తెలుసుకోవడానికి ఐదు నెలల సమయం పడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రయోజనం లేకుంటే తిప్పి పంపాలి కానీ పెండింగ్లో ఉంచడం ఏమిటని విస్తుపోయారు.