RTC | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023’ను రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. కొర్రీల మీద కొర్రీలు వేసినా.. ఎట్టకేలకు ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ అనుమతి ఇవ్వక తప్పలేదు. ఆర్టీసీ కథ సుఖాంతం అయ్యింది. నాలుగు రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన సర్కారులో ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారా.. ఇవ్వరా అనే అనుమానాలు బలంగా వినిపించాయి. పైగా జాప్యం చేసేందుకే గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వందలాదిగా తరలివచ్చి రాజ్భవన్ను ముట్టడించారు. ఆ తరువాత నాటకీయ పరిణామాలతో జరిగిన సంఘటనలు, వీడియో కాన్ఫరెన్స్లు, బుజ్జగింపులు, ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు.. తిరిగి కొర్రీలతో అసలు అనుమతి వస్తుందా లేదా అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఆర్టీసీ బిల్లుపై నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయమే పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు, వివరణలను ఆమూలాగ్రం పరిశీలించారు. అటు ఆర్టీసీ కార్మికుల అసంతృప్తి.. ఇంకా అడగాల్సిన పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో.. దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు 10 సిఫారసులు సూచిస్తూ.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ సంతకం చేసి ప్రభుత్వానికి పంపించారు.
ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత
దీంతో అనేక కష్టనష్టాలతో జీవితాలను వెల్లదీస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత లభించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతభత్యాలతోపాటు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు, పింఛన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ అనుమతివ్వగా, ప్రభుత్వం అంతే వేగంగా బిల్లును రూపొందించి సభ ముందుకు తీసుకొచ్చింది. సభలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బిల్లును ప్రవేశపెడుతూ, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిపోయిందని, దీంతో సంస్థ సేవలు మారుమూల ప్రాంతాల ప్రజలకు, విద్యార్థులు, ఇతర పాస్హోల్డర్లకు అవసరమనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రిమండలి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 1997 చట్టం ప్రకారం పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఉన్న ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు నిషేధం ఉన్నందున ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వివరించారు. ఇందులో భాగంగా రవాణా శాఖలోని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో కొత్త డిపార్ట్మెంట్ హెడ్ను ఏర్పాటు చేయనున్నట్టు, ఇందులో ఆర్టీసీ ఎక్స్అఫీషియో వీసీ అండ్ ఎండీ ఉంటారని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులు యథాతథ స్థితిలో పబ్లిక్ సర్వీసులోకి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని వెల్లడించారు. ఆర్టీసీ కార్యకలాపాలు మునపటిలాగే కొనసాగుతాయని, ఆస్తులు అన్నీ యథాతథంగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టంచేశారు. ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలు రూపొందించే వరకు ప్రస్తుత ఆర్టీసీ సర్వీసు రూల్స్, ఇతర నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు, స్థిర, చర ఆస్తుల నిర్వహణ కొత్తగా ఏర్పడే డిపార్ట్మెంట్, ఆర్టీసీ డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో కలిసి కొనసాగుతాయని తెలిపారు. వారిని విలీనం చేసుకోవడం వల్ల జీతభత్యాల రూపంలో ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.3,000 కోట్ల భారం పడుతున్నదని వివరించారు. నేడు ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 43,055 కాగా, కాంట్రాక్టు, క్యాజువల్ ప్రాతిపదికన ఉన్న ఉద్యోగులు 248 మంది ఉన్నారని తెలిపారు. 43,055 మంది ఉద్యోగులు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ సర్వీసులోకి అబ్జార్బ్ అవుతున్నారని, డైలీ వేజెస్, ఔట్సోర్సింగ్ కార్మికులు యథావిధిగా ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనసాగుతారని వివరించారు. ఎంఐఎం సభ్యుడు మోజంఖాన్, బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ సభ్యుడు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శాసనసభలో బిల్లును సమర్థించారు. అనంతరం సభ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేసే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్టీసీ రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు, 10.5 లక్షల మంది పాస్హోల్డర్లకు రవాణా సేవలను అందిస్తున్నది.
ఎట్టకేలకు దిగివచ్చిన గవర్నర్
ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరిన సమాచారం అందివ్వడం, సందేహాలకు వివరణలు సకాలంలో ఇవ్వడంతో ఆర్టీసీని సర్కారులో విలీనం చేసే ప్రక్రియకు చివరికి అనుమతి ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నంకల్లా అసెంబ్లీలో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అదే సమయంలో దాదాపు 10 సిఫారసులు చేస్తున్నట్టు గవర్నర్ నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే క్రమంలో సంస్థ ఆస్తులు, భూములు కార్పొరేషన్ పరిధిలోనే ఉండాలని రికమెండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను రెండు రాష్ర్టాల మధ్య అంతిమంగా విభజన జరిగేలా చూడాలన్నారు. ఏపీ నుంచి ఆర్టీసీకి ఉన్న బకాయిలపై కూడా క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ సర్వీసుల్లో విలీనం అయిన తరువాత.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే జీతభత్యాలు, సర్వీసు రూల్స్, బదిలీలు, ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, పింఛన్లు, గ్రాట్యుటీ లాంటివి కల్పించాలని రికమెండ్ చేశారు. ఆర్టీసీలో క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని, ఇలాంటి వాటిని మానవీ య కోణంలో ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రయోజనాలను కూడా ప్రభుత్వ నిబంధనల ప్ర కారం కాపాడాలంటూ మొత్తం 10 సిఫారసులు చేస్తూ గవర్నర్ ప్రభుత్వానికి అనుమతిచ్చారు.
ఆర్టీసీలో మహిళా ఉద్యోగులపై వేధింపులకు అడ్డుకట్టవేయాలి
ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై వేధింపులకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆదివారం శాసనమండలిలో ఆర్టీసీ విలీన బిల్లుపై జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ.. ఆర్టీసీలో మహిళా సిబ్బందిపై డిపో మేనేజర్లు, అధికారులు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. యాజమాన్యం దృష్టి సారించి వీటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.
మిన్నంటిన ఆర్టీసీ సంబురం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 6 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంతో ఆ సంస్థ ఉద్యోగులు రాత్రి సంబురాలు జరుపుకొన్నారు. ఉద్యోగులు కరీంనగర్ డిపో-1, డిపో-2కు చేరుకొని బ్యాండ్మేళాలతో నృత్యాలు చేశారు. ‘కేసీఆర్ జిదాంబాద్’ అంటూ నినదించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. కాగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు పటాకులు కాల్చి సంబురాల్లో మునిగిపోయారు. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు మెదక్, అందోల్లో ఉద్యోగులు డిపోల ఎదుట పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
బాజిరెడ్డి నివాసంలో..
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డికి ఆయన సతీమణి వినోద వీరతిలకం దిద్ది, హారతి పట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు బాజిరెడ్డి స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. విలీనం బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సంస్థ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.