ఆసరా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తున్నది. చాలా రాష్ర్టాలు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 75 వేల వార్షిక ఆదాయం మించితే పింఛన్లకు అనర్హులుగా ప్రటిస్తున్నాయి. కేసీఆర్ సర్కారు మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలకు ఆదాయ పరిమితిని పెంచింది. పింఛన్ అర్హత వయసు చాలా రాష్ర్టాల్లో 60-65 ఏళ్లు ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం 57గా ఉంది.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567తో హెల్ప్లైన్ సేవలు ప్రారంభించింది. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమచట్టం(2007)ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. వయోవృద్ధుల సమస్యల సత్వర పరిష్కారం కోసం వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. తొలుత ప్రయోగాత్మకంగా దీనిని హైదరాబాద్లో నిర్వహిస్తున్నది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,44,280 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం గత 9 ఏండ్లలో రూ.18,555 కోట్లు చెల్లించింది.
వృద్ధుల సమస్యల తక్షణ పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం 14567 నంబరుపై హెల్ప్లైన్ సేవలు ప్రారంభించింది. 2019లో తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రవేశపెట్టింది. విశేష స్పందన రావడంతో అక్టోబర్ 2020లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి సమర్థంగా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు ఈ హెల్ప్లైన్కు 1.33 లక్షల మంది కాల్ చేసి సమస్యలు చెప్పుకోగా అన్నింటినీ పరిష్కరించింది.
తెలంగాణ మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం 2011లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం.. తమ సంరక్షణను పట్టించుకోని పిల్లల నుంచి ఆస్తులు వెనక్కి తీసుకునేలా చట్టాన్ని సవరించింది. పిల్లల ఆదాయం పెరిగితే ఆ మేరకు తమకూ జీవనభృతిని పెంచేలా కోరుతూ ట్రిబ్యునల్ను ఆశ్రయించేలా నిబంధనలు మార్చింది. బాధిత వృద్ధుల నుంచి ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా www. tsseniorciti zens. cgg.gov.inను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లాకు 50 నుంచి 100 పడకలతో అన్ని వసతులతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నది. తొలివిడతలతో 12జిల్లాలకు వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది. ఒక్కో వృద్ధాశ్రమానికి రూ. 50 లక్షలు కేటాయించింది.ఇప్పటికే రాజన్నసిరిసిల్లా, సిద్దిపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలో వృద్ధాశ్రమాలు అందుబాటులోకి వచ్చాయి.
మొబైల్ మెడికేర్ యూనిట్ సేవల కోసం రెడ్క్రాస్ సొసైటీతో ప్రభుత్వం చేతులు కలిపింది. తొలివిడతగా 15జిల్లాల్లో 17వాహనాలతో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2 చొప్పున, భద్రాచలం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్కర్నూల్, పెద్దపల్లి, సంగారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో వాహనం ద్వారా సేవలను అందిస్తున్నది. ప్రతి జిల్లాలో 70-100 క్యాంపులతో 5 వేల మంది వృద్ధులకు వైద్యసేవలను అందిస్తున్నది.
వృద్ధుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న హెల్ప్లైన్ సేవలు, మొబైల్ మెడికేర్ యూనిట్లు, ఆన్లైన్ సేవలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ తదితర వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి నుంచైనా వేధింపులు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలి. వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
– శైలజ, కమిషనర్, దివ్యాంగులు, వయోవృద్ధులు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారతశాఖ