హైదరాబాద్, మే20 (నమస్తే తెలంగాణ) : రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై సమగ్ర అధ్యయనానికి సంబంధించిన మార్గదర్శకాల్లో తెలంగాణ అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకొని పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కేఆర్ఎంబీకి సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రస్తుత ఆర్డీఎస్ పరిస్థితి, నీటి వినియోగం అంశాలపై పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అధ్యయనం చేయించాలని నిర్ణయించడం, అందుకు ఇటీవల కేఆర్ఎంబీ మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే.
కేఆర్ఎంబీ రూపొందించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. ముందుగా 2004లో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు
కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం గైర్హాజరైంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి రూల్ కర్వ్స్, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాల అధ్యయనానికి సంబంధించి ఇటీవల బోర్డు సమావేశంలో ప్రత్యేకంగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు, హైడల్ పవర్ డైరెక్టర్, సీఈ సభ్యులుగా ఉన్నారు.
ఆర్ఎంసీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వర్షకాల సీజన్కు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నామని, ఈ నేపథ్యంలో సమావేశాన్ని జూన్15కి వాయిదా వేయాలని తెలంగాణ సర్కారు ముందుగానే కేఆర్ఎంబీకి సూచించింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ సమావేశాన్ని యథావిధిగా శుక్రవారం నిర్వహించగా, తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకాగా, వారి అభిప్రాయాలను మాత్రమే కమిటీ కన్వీనర్ నమోదు చేయడం గమనార్హం.