హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కూలీలకు పని కల్పించడంతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు పూర్తి చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పనులు చేపట్టవచ్చని సూచించింది. ఈ సంవత్సరం కేంద్రం రాష్ర్టానికి 11 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఇప్పటికే 10.69 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా 2.75 లక్షల మంది కూలీలు పనులకు హాజరు కాగా సంఖ్య 13న 2.96 లక్షలకు పెరిగింది. ఉపాధి హామీ కూలీల కోసం 4.28 లక్షల పనులు చేపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులు 60 శాతం వరకు ఉంటున్నాయి. ప్రతి జిల్లాలో కనీసం 10 వేల మందికి అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు.
గత సంవత్సరం మార్చి చివరి నాటికి 14.57 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. కేంద్రం కొంతకాలంగా విధిస్తున్న నిబంధనల కారణంగా కూలీలు పనులకు రావడానికి కొంత వెనకడుగు వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన ఉపాధి హామీ పనులకు 21.69 శాతం మంది ఎస్సీలు, 20.29 శాతం మంది ఎస్టీలు హాజరయ్యారు. ఉపాధి హామీకి హాజరయ్యే వారిలో అత్యధికంగా 61 శాతం మంది మహిళా కూలీలే ఉంటున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా 100 రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 20,482 కుటుంబాలు మాత్రమే వంద రోజులు పూర్తి చేయగా గత సంవత్సరం 3.28 లక్షల కుటుంబాలు వంద రోజులు పూర్తి చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవి ఎండల దృష్ట్యా అదనపు మొత్తాన్ని చెల్లించింది. అయితే కేంద్రం తాము రూపొందించిన సాఫ్ట్వేర్నే ఉపయోగించుకోవాలని షరతు విధించడంతో అదనపు కూలీ అందించలేని పరిస్థితి ఏర్పడింది.