Karnataka Farmers | మక్తల్టౌన్, అక్టోబర్ 26: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కర్ణాటక రాష్ట్రం యాదిగిరి జిల్లా గుర్మిట్కల్ నియోజకవర్గానికి చెందిన దుప్పల్లి, బద్దిపల్లి, అజిలాపూర్ గ్రామాల రైతులు గురువారం నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని బైరంపల్లి గ్రామ శివారులో ఉన్న సరిహద్దు వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మి ఓటేస్తే.. విద్యుత్తు కోతలతో తెలంగాణ సమాజం కూడా అల్లాడుతదని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్రోకాన్ని చూపిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నదని వాపోయారు. వ్యవసాయానికి కనీసం 2 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నదని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం, ఆసరా పింఛన్, రైతుబీమా, దళితబంధుతోపాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ప్రశంసించారు. తెలంగాణకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాము కూడా తెలంగాణలో ఉండి ఉంటే కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపేవారని అజిలాపూర్ రైతు సిద్ధప్ప పేర్కొన్నారు.