జనగామ : గిరిజన రిజర్వేషన్లపై ఏడేండ్ల ఓపికకు కేంద్రం పరీక్ష పెట్టింది. సీఎం కేసీఆర్ ఓపిక పట్టారు. అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపితే అతీగతీ లేదు. అందుకే సీఎం ఓ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజుల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల పెంపుని అమలు చేస్తామని ప్రకటించారు.
ఇది చాలా సంతోషకరమైన విషయం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచుతామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి అధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు అలవి కాని కోరిక ఏమీ కోరడం లేదన్నారు. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయమంటున్నరు.
గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ల బిల్లుని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, కేంద్రానికి పంపించిందని మంత్రి వివరించారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టే పిచ్చి మత విద్వేషాలు తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదన్నారు. బీజేపీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి అన్నారు.