Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. డీలర్ల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టన్నుకు రూ.700గా ఉన్న కమీషన్ను ఇప్పుడు రూ.1,400లకు పెంచింది. అంటే కమీషన్ను ఒకేసారి రెండింతలు పెంచడం గమనార్హం. పౌరసరఫరాల శా ఖ మంత్రి గంగుల కమలాకర్ ఇందుకు సం బంధించిన జీవో కాపీని రేషన్ డీలర్లకు అందజేశారు. కమీషన్ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.245 కోట్ల అధనపు భారం పడనున్నది.
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. కమీషన్ పెంపు అంశంపై గత నెల 8న మంత్రులు హరీశ్రా వు, గంగుల కమలాకర్ రేషన్ డీలర్లతో చర్చ లు జరిపారు. ఈ సందర్భంగా కమీషన్ పెం చాలని నిర్ణయించారు. అనంతరం ప్రభుత్వ ఆమోదంతో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమీషన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు రేషన్ డీలర్లు సీఎం కేసీఆర్కు, మంత్రి గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎల్లప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భం గా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రి గంగులను సన్మానించి కృతజ్ణతలు తెలియజేశారు. కేంద్రం వాటాకు మించి కమీషన్ అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఇందుకు కృషి చేసిన మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రేషన్ డీలర్ల సేవలను గుర్తించిన కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రేషన్ డీలర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి గంగుల చెప్పారు. కమీషన్ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ డీలర్ల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో వారి సేవలను కేసీఆర్ గుర్తించారని తెలిపారు. కేంద్రంతో సంబంధం లేకుండా దాదాపు 90 లక్షల మంది పేదలకు పూర్తి రేషన్ బియ్యంను ప్రభుత్వమే సొంత ఖర్చులతో అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం ఏటా రూ.3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సేవలు అందించాలని రేషన్ డీలర్లకు సూచించారు.