హైదరాబాద్ : సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాసాబ్ ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా కారణంగా ఏడాదిగా సినిమా థియేటర్లు మూసి ఉండటంతో సినీ ఎగ్జిబిటర్లు, థియేటర్ల నిర్వహకులు ఆర్థికంగా నష్టపోయామని ప్రభుత్వం తరఫున అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు.
సినిమా థియేటర్లు మూతపడిన సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయించాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ చార్జీ వసూలుకు వెసులుబాటు కల్పించాలి. ఎస్జీఎస్టీ ట్యాక్స్ రద్దు చేయాలి. జీఓ 75ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించేలా చూడాలని మంతి కోరారు. స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు ఉన్నారు.