Telangana | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తాగునీటి కోసం మహారాష్ట్రలోని కోయినా నుంచి తొలుత 30 టీఎంసీలను ఆడగాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పుడు కర్ణాటక రాష్ర్టాన్ని కూ డా 10 టీఎంసీలు కోరాలని యోచిస్తున్నది. కృష్ణా నీటిని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో త్వరలో పర్యటించనున్నదని సాగునీటిపారుశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల స్వయంగా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని నీటినిల్వలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా ఈ ప్రతిపాదనలు చేయాలని యోచిస్తుండటంపై అధికారులు విస్తుపోతున్నారు.
కర్ణాటకలో తీవ్ర కరువు
గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా అప్పర్ కృష్ణా బేసిన్.. అంటే కలబురగి, రాయచూర్, బాగల్కోట్, యాద్గిరి జిల్లాలో కరువు తాండవిస్తున్నది. కర్ణాటకలోని 31 జిల్లాల్లో ఉన్న 236 తాలుకాల్లో తొలి విడతలోనే 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారంటే పరిస్థితిని ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక అప్పర్కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలో కలిపి మొత్తం 81.76 టీఎంసీల నీరు ఉండగా, అందులో వినియోగానికి 47 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ జలాల్లోనూ ఆ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 37 టీఎంసీలు కేటాయించుకున్నారు.
ఇతర అవసరాలకు 3 టీఎంసీలను పెట్టుకున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు సాగు చేయవద్దని కర్ణాటక ప్రభుత్వం కోరినా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల రైతులు వరి పంటకు బదులు మిర్చి సాగు చేస్తున్నారు. వారికి సాగునీరివ్వడానికే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. మరోవైపు రైతులు నీళ్లకోసం ధర్నాలు చేస్తున్నారు. కలబురగి, రాయచూర్, బాగల్కోట్, యాద్గిరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శివకుమార్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి 2.75 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అలాంటి కరువు పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక ఇప్పుడు తెలంగాణకు 10 టీఎంసీలు ఇస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఇచ్చినా అక్కడి రైతులు ఊరుకుంటారా? అన్నది కూడా అనుమానమే.
నీళ్లు రావడమూ అనుమానమే
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు 10 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించినా అవి ఇక్కడి రావడం కష్టమే. 10 టీఎంసీల్లో దాదాపు 25 శాతానిపైగా ట్రాన్స్మిషన్ నష్టాలుగా పోనున్నాయి. మిగిలిన నీళ్లన్నా వస్తాయా అన్నది అనుమానమే. ఆల్మట్టి నుంచి జూరాల ఎగువన కర్ణాటకలో కృష్ణా నదిపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఆనట్టలు నిర్మించింది. అందులో దాదాపు 5 ఆనకట్టల సామర్థ్యం 2 టీఎంసీలకు మించి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాటిల్లో ప్రస్తుతం తగినంత నీరు లేదు. తెలంగాణ కోరికమేరకు కర్ణాటక నీటిని విడుదల చేసినా అవి ఆ ఆనకట్టలను దాటి రావడం కష్టమేనని అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఇంత భిన్నంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం కర్ణాటకను అడుగుతామని ప్రకటించటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.
కోయినా కింద కూడా అదే పరిస్థితి
ఎగువన మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ పరిధిలోని పరిస్థితి కూడా ఇదే రీతిన ఉన్నది. డ్యామ్లో ప్రస్తుతం 75 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఆ డ్యామ్ సతారా, సాంగ్లి, సోలాపూర్ జిల్లాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆయువు. ఈ ఏడాది అక్కడ కూడా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఈ ఏడాది కొయినా డ్యామ్ కింద ఆయకట్టుకు సాగుకు కోత విధించింది. తాగునీటికి మాత్రమే ఇస్తామని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు ఆ ప్రభుత్వం నీళ్లు ఇస్తుందా అనేది అనుమానమే.