కరీంనగర్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్నగర్, రేకుర్తి గ్రామంలో శనివారం దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిభాపూలే కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు మారినా దళితుల తల రాతలు మారలేదని, గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని విమర్శించారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అనేక నిబంధనలు విధిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. గత 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారులకు గాను 11,500 మందికి పథకం వర్తింపజేసినట్లు చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, ఇప్పటి వరకు 250 మందికి
యూనిట్లు మంజూరు చేశామన్నారు.
యూనిట్ల పనితీరును నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంజూరైన వంద యూనిట్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజవర్గానికి 1500 మంది లబ్ధిదారులను దళిత బంధు పథకానికి ఎంపిక చేయనున్నామని, సోమవారం అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారని వివరించారు. మొదటి ప్రాధాన్యతగా నిరుపేదలను మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
మానవతకు మారుపేరు కేసీఆర్ అనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా లెక్కకు మించిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తోందన్నారు. పేదల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, సుడా చైర్ పర్సన్ జీవి రామకృష్ణ రావు, యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, కంసాని శ్రీనివాస్, నక్క పద్మా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.