Telangana | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. ఈ సందర్భంగా నూతన సచివాలయం ప్రజా ప్రతినిథులు, ఆహ్వానితులు, సచివాలయ ఉద్యోగులు, పలు శాఖల విభాగాల విభాగాధిపతులు, అధికారులు, వేలాది మంది సిబ్బందితో కళకళలాడింది.
తొలుత ప్రగతి భవన్లో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అక్కడ నుండి సెక్రటేరియట్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదిక మీదకు చేరుకున్న అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశాన్నిచ్చారు. తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న స్వయం పాలన, సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ విశ్లేషణాత్మకంగా వివరించారు.
తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్ 2 నాడు భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అనేక అడ్డంకులు దాటుకుంటూ ప్రగతి ప్రస్థానంలో సాగుతూ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ మోడల్గా కీర్తి ప్రతిష్టలందుకుంటున్న జన పాలన గురించి సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కూలంకషంగా వివరించారు. గంటన్నరపాటు సాగిన ప్రసంగంలో ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని మానవీయ కోణంలో సాగించిన పాలనాదార్శనికతను విశ్లేషించారు. వ్యవసాయం నుంచి మొదలుకొని ఆర్థిక రంగం వరకు అన్ని రంగాల్లోగుణాత్మక అభివృద్ధి సాధించడం వెనక జరిగిన ప్రభుత్వ కృషిని ప్రజల భాగస్వామ్యం గురించి సీఎం వివరించారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి స్పూర్తిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సర్వజన హితాన్ని కాంక్షిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ సహా పేద వర్గాలకు సర్వజన సుఖం కోసం తమ పాలన కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, నామా నాగేశ్వర్ రావు, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగులు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కవిత, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, గోరేటి వెంకన్న, రవీందర్ రావు, కర్నె ప్రభాకర్, దండే విఠల్, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎల్విస్ స్టీవెన్ సన్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ సలహాదారులు ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు, ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా, సీఎం గారి మనవడు హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.