సంగారెడ్డి: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. కేసీఆర్ ఒక క్రిమినల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీతో కొడుతా అని ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకుని బయటికొచ్చిండని విమర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా రేవంత్ రెడ్డి పదవిని పట్టుకుని పాకులాడిండని ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రి హరీశ్రావు ఇంకా ఏమన్నారంటే.. ‘తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు ముఠా కట్టిండ్రు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు, నికార్సయిన తెలంగాణ బిడ్డ కేసీఆర్కు మధ్య ఇప్పుడు పోటీ జరుగుతున్నది. తెలంగాణ గెలువాలంటే మనం కారుకు ఓటెయ్యాలె. కేసీఆర్ పక్కన నిలువాలె. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన రేవంత్రెడ్డి కేసీఆర్ను క్రిమినల్ అంటున్నడు. అసలు సిసలు క్రిమినల్ రేవంత్రెడ్డే. చర్లపల్లి జైలులో రేవంత్రెడ్డి ఖైదీ నెంబర్ 4170, చంచల్గూడ జైలులో ఖైదీ నెంబర్ 1779. ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతున్న ఖైదీ రేవంత్రెడ్డి. రేవంత్ది నియంత పోకడ. రేవంత్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నడని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నరు’ అని విమర్శలు గుప్పించారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండంగా రాంగ్ లీడర్లు ఎందుకు
‘ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డా కూలీలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్కు ఎంత అహంకారం ఉంటే తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఓయూ విద్యార్థుల గురించి అలా మాట్లాడుతడు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తాగునీటికి ఇబ్బంది లేదు. కరెంటు కోతల్లేవు. రైతుబంధుకు ఇబ్బంది లేదు. ఆడపిల్లల పెళ్లిల్లకు ఇబ్బందులు లేవు. కొట్లాటలు లేవు. కర్ఫ్యూలు లేవు. తెలంగాణ ఇంత మంచిగ ఉన్నప్పుడు పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఇబ్బందుల్ల పడుతం. రిస్క్ అవసరమా..? కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు భంగపడ్డరు. కాంగ్రెస్ను నమ్మితే మనం కూడా రిస్క్ల పడుతం. కాబట్టి రిస్క్ వద్దు. ‘స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండంగా రాంగ్ లీడర్లు ఎందుకు’ అని ప్రజల మధ్య చర్చపెట్టండి’ అని మంత్రి సూచించారు.