కుత్తుకల దాకా మిత్తీలతో నిండిపోయిన రాష్ట్ర వ్యవసాయాన్ని 9 ఏండ్లలో లాభసాటిగా మార్చి సాగును పండుగ చేసి చూపించిన
కర్షకుడు, ఆకర్షకుడు కేసీఆర్! పేదరైతు కష్టం తెలిసిన పెద్దరైతు కేసీఆర్! ఆయన మాటంటే మాటే! ఇస్తే చేసి చూపిస్తారంతే!
అందుకే, వరుసగా రెండు పర్యాయాలు రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే!
చేసి చూపించింది కేసీఆర్ ఒక్కరే!
ప్రకటన చేసి, పది రోజులైనా గడవకముందే లక్షలోపు ఉన్న రుణాలన్నీ చుక్తా చేశారు. రూ. 99,999 లోపు ఉన్న పంట రుణాలను మాఫ్ చేసి, 9,02,843 మంది రైతులను రుణ విముక్తులను చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 16.22 లక్షల మంది రుణాలు మాఫీ అయ్యాయి.
ఇది అన్నదాతలకు కేసీఆర్ అందించిన స్వాతంత్య్ర దినోత్సవ కానుక. ఇది మానవీయ పాలనకు మరో మచ్చుతునక.
CM KCR | హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు. పంట రుణమాఫీలో భాగంగా రూ. 99,999 లోపు ఉన్న మొత్తం రుణాలను మాఫ్ చేసి 9,02,843 మంది రైతులను రుణ విముక్తులను చేశారు. రుణ మాఫీకి అవసరమైన మొత్తం నగదును రైతుల తరఫున బ్యాంకులకు జమ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సోమవారం ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన రూ. 5809.78 కోట్లను ఆర్థిక శాఖ బ్యాంకులకు విడుదల చేసింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి నుంచి రూ. 99,999 వరకు గల రూ.7,753.43 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో 16,22,330 మంది రైతులు రుణవిముక్తులయ్యారు.
రైతులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మారోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం… రైతు ప్రభుత్వమని చాటిచెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రుణవిముక్తి పొందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష వరకు గల రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు 35.32 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. తిరిగి 2018 ఎన్నికల సమయంలో కూడా లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రూ. లక్ష వరకు గల రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రూ. 99,999 వరకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వచ్చే నెల రోజుల్లో రూ. లక్ష వరకు గల రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి మొత్తాన్ని త్వరలోనే బ్యాంకులకు విడుదల చేయనుంది.
రెండోసారి అధికారంలోకి రాగానే రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అయితే, ఊహించని విధంగా కరోనా మహమ్మారి విజృంభించడం, లాక్డౌన్, మన దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒకసారిగా ఒడిదొడుకులకు గురైంది. ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం కష్టమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీని కొనసాగించారు. ఇందులో భాగంగానే 5.42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.36 వేల వరకు గల రూ. 1207.37 కోట్ల రుణాలను మూడేండ్ల క్రితమే ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే, మిగిలిన రుణ మాఫీకి సంబంధించి ఈ నెల రెండో తేదీన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… నవంబర్ రెండో వారంలోపు (45 రోజుల్లోనే) మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.
ఈ మేరకు ఈ నెల 3న రూ.18,241 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ తొలుత చెప్పిన ప్రకారం రుణమాఫీకి మరో నెల రోజుల సమయం ఉంది. అయినప్పటికీ ఇచ్చిన మాటకన్నా ముందే మెజార్టీ రైతుల రుణాన్ని మాఫీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 3న రూ. 41వేల లోపు రుణాలున్న 62,758 మంది రైతులకు సంబంధించి రూ. 237.85 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఆగస్టు 4న రూ. 43వేల లోపు రుణాలున్న 31,339 మంది రైతులకు సంబంధించిన రూ. 126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ నెల 11న మరోసారి 82,781 మంది రైతులకు సంబంధించిన రూ. 371.93 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ విధంగా రూ. 50వేల లోపు గల రూ. 736.27 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తద్వారా 1.76 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఇక మిగిలిన రుణాల మాఫీకి సంబంధించి సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రూ. 99,999 వరకు గల రుణాలను మాఫీ చేస్తూ సీఎం ప్రకటించారు. ఇందుకోసం రూ. 5809.78 కోట్లను రైతుల తరుపున బ్యాంకులకు ప్రభుత్వం జమ చేసింది. తద్వారా 9.02 లక్షల మంది రైతులు రుణవిముక్తులయ్యారు.
పంట రుణాల మాఫీతో తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యమని మరోసారి నిరూపితమయ్యింది. ఇప్పటికే దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు, వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల పూర్తితో సాగునీటి గోస తీర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తుతో కరెంట్ సమస్యకు పరిష్కారం చూపింది. దీంతోపాటు రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించి, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాల బెడద లేకుండా పీడీ చట్టం ప్రయోగించడం, పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, మారెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి ఎన్నో వినూత్న, అద్భుతమైన పథకాలను అమలుచేసింది. రైతులకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రూ.96,288 కోట్లను ఖర్చు చేసింది. ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇప్పటివరకు మరణించిన 1.08 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. 5,402.55 కోట్లను పరిహారంగా అందించింది. రైతుబంధు కింద ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 11 విడుతలలో రూ.71,552 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రాష్ట్ర రైతన్నలకు గొప్ప వరమని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రైతుల రుణ మాఫీపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో వరుసగా ఇంతపెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రూ.99,999 లోపు పంట రుణం ఉన్న 9.02 లక్షల మంది రైతులకు ఒకేసారి రూ.5,809 కోట్లను మాఫీ చేసిన రైతుబంధు తెలంగాణ సర్కార్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ఖజానా నుంచి ఒకేరోజు 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ట్రెజరీ నుంచి అత్యధికంగా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ సొంతం చేసుకున్నదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.99,999 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ట్విట్టర్ వేదికగా మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ ఏనాడూ రాజీ పడలేదు. ఒకేరోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ నెలకొల్పింది. దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్లో నిల్చొనే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతున్నది. విపత్తు సమయంలోనూ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగించారు. ఇప్పుడు రుణమాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెకడా లేనివిధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం’ అని మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.