హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశమంతా అమలుకావాలని జాతీయ రైతు ఉద్యమనేత, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తికాయత్ గురువారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు అన్ని రాష్ర్టాల్లో అమలు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తుతోపాటు అనేక పథకాలు, కార్యక్రమాలను రైతు సంక్షేమంకోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని కొనియాడారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయం అన్నా పట్టింపులేదని ఆయన ధ్వజమెత్తారు. తమకు న్యాయంచేయాలని కోరితే లాఠీలు, జల ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు, రోడ్లపై ఇనుప కంచె నాటే దుర్మార్గ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదని తికాయత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నా, ఆ శాఖకు రైతుల కష్టాలు తెలియవని తెలిపారు. సీఎం కేసీఆర్తో భేటీ సందర్భంగా వివిధ రాష్ర్టాల్లో నెలకొన్న రైతు స్థితిగతులు, వ్యవసాయ విధానాలపై చర్చించినట్టు వెల్లడించారు. దేశంలో వ్యవసాయరంగాన్ని గాడిన పెట్టాలంటే ప్రత్యామ్నాయ నూతన విధానం రావాల్సిన అవసరమున్నదని, అందులో భాగంగానే తాను సీఎం కేసీఆర్ను కలిశానని చెప్పారు. వచ్చే సంవత్సరం హైదాబాద్లో అంతర్జాతీయ రైతు సదస్సును నిర్వహిస్తామని తికాయత్ ప్రకటించారు.
ఈ నెల 10 తరువాత కేసీఆర్కు అమర కిసాన్ల జాబితా
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన రైతుల జాబితాను ఈనెల 10 తరువాత సీఎం కేసీఆర్కు అందజేస్తామని రాకేశ్ తికాయత్ తెలిపారు. మరణించిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని కృతజ్ఞతలు చెప్పారు. తాము మరణించిన రైతుల జాబితా అందించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని తానే స్వయంగా వచ్చి అందజేస్తానని సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు.