Telangana | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై రైతులు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట రైతులు లేఖలు రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంథాలో సిద్దిపేట రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు హామీలు అమలు చేయాలి. లేని పక్షం లో ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తాం అని రైతులు హెచ్చరించారు.
రైతుల పోస్టు కార్డు ఉద్యమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్లో, సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో, చిన్న కోడూర్ మండలం మార్కెట్ యార్డ్లో రైతులు స్వచ్చందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్కు తెలిపారు.
-వరి ధాన్యానికి రూ. 500 బోనస్
-రైతు భరోసా రూ. 10,000లకి బదులు రూ. 15000
-రైతు కూలీలకు రూ. 12000..
-రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు..
-రైతు బీమా..
-వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ. 25000..
ఈ హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెపుతాం అని హెచ్చరించారు.