పదేండ్లు పచ్చని పంటలు పండినయ్.. పదిదినాల్లో పొలాలన్నీ ఎండుతున్నయ్
పదేండ్లు గుట్టలుగా ధాన్యం పుట్టింది.. పదిదినాల్లో వరి కంకి బుగ్గి పాలైంది
పదేండ్లు రైతన్న గుండె నిండా భరోసా.. పదిదినాల్లో రైతుల ముఖాల్లో నిరాశ
నీళ్లు లేక భూతల్లి తడారి పోతున్నది.. ఏసిన పంట ఏసినట్టే ఎండుతున్నది
పంట చేను పశువుల కొట్టమైంది.. అన్నదాత గుండె కోతకు గురైంది
ఎటు పోతున్నది నా తెలంగాణ?.. ఏమై పోతున్నది నా తెలంగాణ?
ఏమి దౌర్భాగ్యం నా తెలంగాణకు?.. ఇదేమి గోస నా తెలంగాణకు?
-నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్
Telangana | ఆదిలాబాద్ నుంచి జోగులాంబ గద్వాల దాకా, కామారెడ్డి నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా.. 33 జిల్లాల్లోనూ పంట పొలాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. కాళేశ్వర జలాలు విడుదల చేయక, నాగార్జున సాగర్ నీళ్లు అందక, శ్రీరాంసాగర్, దేవాదుల నీళ్లు రాక, భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండుతున్నాయి.
వరి, మక్క, బబ్బెర, పెసర, టమాట, మిరప, బెండ, చిక్కుడు, వంకాయ చేన్లు బీడువారుతున్నయి. గత ఏడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకొన్న రైతులు.. ఈ ఏడు పొలాలు పడావు పడుతుంటే తండ్లాడుతున్నరు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చిన పంటలు ఎండుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.
ఎండిన శ్రీరాంసాగర్ కాలువ
జనగామ జిల్లా జనగామ మండలంలోని సిద్దెంకి, పెద్దరాంచర్ల, ఓబుల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్, గోపరాజుపల్లి, ఎర్రకుంటతండాలో రైతులు సాగునీటికి తిప్పలు పడుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి ప్రతి గ్రామానికి కాలువల ద్వారా గోదావరి జలాలు విడుదల చేశారు. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తండధర్మారం ఆకేరువాగు పరివాహక గ్రామాలైన తండధర్మారం, ఉల్లేపల్లి, పురుషోత్తమయాగూడెం, బీచ్రాజ్పల్లి, బాల్నిధర్మారంతో తదితర గ్రామాల్లో చెరువుల్లో చుక్కనీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగరలో బోర్లు, బావులు, శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడి సాగుచేసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలకు నీరు అందటం లేదు.
దేవాదుల నీటి కోసం ఎదురుచూపు
ఎస్సారెస్పీ ద్వారా ప్రధాన కాలువకు ఎడమవైపున ఉన్న గ్రామాల పంట భూములకు మాత్రమే సాగునీరు అందుతున్నది. కుడివైపున ఉన్న గ్రామాలకు చెరువులు, దేవాదుల నీరే ఆధారం. యాసంగి పంటకు చెరువులలో ఉండే నీరు ఏమాత్రం సరిపోదు. అందుకని గత కేసీఆర్ ప్రభుత్వం యాసంగి పంట సాగు సమయంలో దేవాదుల ద్వారా ఉప్పుగల్లు రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేసింది.
దీంతో ఆకేరువాగుకు అనుసంధానంగా ఉన్న వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట కోనారెడ్డి, ఇల్లంద పెద్దచెరువుతో పాటుగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని అన్ని గ్రామాలకు యాసంగి పంటలకు సాగునీరు అందింది. ఈ ఏడాది ప్రస్తుతం వరి పంటలు సాగు చేసి 20 రోజులే అయింది. మరో రెండున్నర నెలలపాటు వరి పంటకు సాగునీరు అవసరం ఉంటుంది. దేవాదుల నుంచి నీటికి విడుదల చేయకపోతే పంటలన్నీ ఎండిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో కనిష్ఠ సాగు
సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ముందుండే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈసారి పూర్తిగా వెనుకబడింది. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరు అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోతున్నది. దాంతో ఆయకట్టు అంతా ఎడారిగా మారింది. చుక్క సాగునీరు కూడా లేకపోవడంతో వరి పొలాలన్నీ నెర్రెలువారాయి. ఇంకోవైపు ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గడంతో కూరగాయల ధరలు పిరం అవుతున్నాయి.
సాగర్ నీరు విడుదల కాకపోవడంతో జిల్లాలో సాగు గణనీయంగా తగ్గి 1.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వీటిలో వరి 85,408 ఎకరాలు, మక్క 60,082 ఎకరాలు, పెసర 7,361 ఎకరాలు, చెరుకు 83 ఎకరాలు, వేరుశనగ 590 ఎకరాలు, మినుము 808 ఎకరాలు, కంది 135 ఎకరాలు, జొన్న 333 ఎకరాలు ఇతర రకాలు మరో 1000 ఎకరాల్లో సాగవుతున్నాయి. బోర్లు, బావుల్లోనూ నీళ్లులేకపోవడంతో ఉద్యాన పంటల దిగుబడి తగ్గింది. ప్రస్తుతం 1,277 ఎకరాల్లోనే కూరగాయలు సాగు అవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు మరీ దయనీయంగా 36 వేల ఎకరాలకే పరిమితమైంది.
ఎడారిని తలపిస్తున్న సాగర్ ఆయకట్టు
నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలోని సాగర్ ఆయకట్టులో సుమారు 40 వేల నుంచి 50 వేల ఎకరాల వరకు వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం స్పందించి సాగునీటిని విడుదల చేస్తే తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. సాగునీటిని విడుదల చేస్తే ఈ భూమంతా సాగులోకి వచ్చేది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఆయకట్టు విస్తరించిన నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పాలేరు నుంచి మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా ఉన్నారు. వీరిలో ఎవరూ తాజా పరిస్థితులు, రైతుల ఇబ్బందులపై దృష్టి సారించిన దాఖలాలు కనిపించటం లేదు.
ఇంతకంటే నీటి లభ్యత తక్కువగా ఉన్నా గత బీఆర్ఎస్ సర్కార్ నీటిని విడుదల చేసిందని, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునసాగర్, కాళేశ్వరం, మూసీ.. ఈ మూడు నీటి వనరులతో కళకళలాడిన సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. మండలంలో 32 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు 22 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. కాళేశ్వరం, నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈ ప్రాంతంలో పెన్పహాడ్ మండలమే చివరిది కావడంతో నీళ్లు అందటం లేదు.
జూరాల డెడ్ స్టోరేజీ.. ‘భీమా’ వెలవెల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పంటలు కాపాడుకోవటానికి తంటాలు పడుతున్నారు. మరో 20 రోజులు సాగునీరు అందకుంటే పొలాలన్నీ నెర్రెలు బారడం ఖాయంగా కనిపిస్తున్నది. జురాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. భీమా ప్రాజెక్టు రిజర్వాయర్లన్నీ నీళ్లులేక వెలవెలబోతున్నాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్, కోయిల్సాగర్ ప్రాజెక్టులన్నీ ఖాళీ అవుతున్నాయి. సాగునీరు లేక ఈ ఏడాది యాసంగి వరి సాగు గణనీయంగా పడిపోయింది.
ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే గత ఏడాది 42,950 ఎకరాలలో వరి సాగు చేస్తే ఈ యాసంగిలో ఇప్పటి వరకు 28,723 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కోయిల్సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో ఈసారి మూడో విడుత సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నారాయణపేట జిల్లాలోని మక్తల్లో ఇప్పటికే బోర్ల కింద సాగుచేసిన వరి ఎండుతున్నది. వనపర్తి జిల్లాలో కొందరు రైతులు పొలాలు ఎండిపోవడంతో పశువులకు, గొర్రెలను మేపడానికి వదులుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో కూడ పంటలు ఎండిపోయే స్థితికి చేరాయి. అటు.. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల కింద అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో వివిధ పంటలు పూర్తిగా ఎండిపోయాయి.
పొన్నం ఇలాకాలో ఎండుతున్న పంటలు
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, మక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేల్లలో పశువులను మేపుతున్నారు. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో రైతులు తమ పంట చేలు ఎండిపోవడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి చెరువును కాళేశ్వర జలాలతో నింపటంతో రైతులకు సాగునీటి కష్టాలు రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
మెతుకు సీమకు సాగునీటి కష్టాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పొట్ట దశకు చేరగా, ఈ సమయంలో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.అనధికార కరెంట్ కోతలు మొదలయ్యాయి. కరెంటు ఇచ్చినట్టే ఇస్తుర్రు. కానీ, ట్రిప్ అవుతున్నది. దీంతో మోటర్లు కాలిపోతున్నాయి. కండ్ల ముందే ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఏడేనిమిది ఏండ్ల తర్వాత పంట చేలు ఎండిపోవటం చూస్తున్నామని, మళ్లీ పాతరోజులు యాదికి వస్తున్నాయని వాపోతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఐదారేండ్లుగా ఎండకాలం రాకముందే కాళేశ్వర జలాలతో చెరువులు, కుంటలు, వాగులు నింపటంతో సాగునీటి కష్టాలు లేకుండే అని పేర్కొంటున్నారు. ఈ యాసంగికి సాగునీటిని విడుదల చేయాలని హరీశ్రావు స్వయంగా నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆ తర్వాత మంత్రికి ఫోన్చేసి నీటిని విడుదల చేయాలని విన్నవించటంతో పాటు స్వయంగా ఉత్తరం రాశారు. ఆయన చొరవతో రైతులకు ఈ ఏడాది జనవరి 24న మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ సాగునీటిని విడుదల చేశారు.
ఏం జరిగింది?
కేసీఆర్ ప్రభుత్వంలో సాగు ప్రారంభం కాగానే ఏ ప్రాంతానికి ఎంత నీటిని విడుదల చేయాలి? ఎన్ని చెరువులు నింపాలి? అన్న ప్రణాళికతో ముందుకు వెళ్లేవారు. ఫలితంగా అన్ని ప్రాంతాలకు కాళేశ్వర జలాలు అందేవి.
ఏం జరుగుతున్నది?
కాంగ్రెస్ హయాంలో పొలాలకు నీళ్లు లేవు. పంటలన్నీ ఎండిపోతున్నయ్. భూములన్నీ నెర్రెలిస్తున్నయ్. ట్రిప్పుల కరెంటుతో మోటర్లన్నీ కాలిపోతున్నయ్. ఎండిన పంట.. పశువులకు మేత. అన్నదాతకు కడుపు కోత.
రెండెకరాల మక్క ఎండిపోయింది
నీళ్ల కరువుతోటి నేనేసిన రెండెకరాల మక్కపంట పూర్తిగా ఎండిపోయింది. ఏ అధికారి కూడా ఇటువైపు వచ్చి అడిగింది లేదు. మక్క పంట పండితే ఉన్న అప్పులు కొంత తీరుతయ్ అనుకున్న. కానీ, నీళ్లందక పీచు వేసే దశలోనే ఎండిపోయింది. వేసిన కొద్ది వరిపంట కూడా వరుస తడులతో పారిస్తున్న. అదికూడా చేతికందుతుందో లేదోననే రందైతంది.గతంల సర్కారు వేసిన సాయం అందితే పెట్టుబడికి పనిచేసింది. ఈసారి అది కూడా అందలేదు. ఏపుగా ఎదిగిన సమయంలో మక్క ఎండిపోవటంతో పానం కొట్టుకుంటున్నది.
-కుందేళ్ల యాదగిరి, రైతు, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా
పాత రోజులు వస్తాయని భయం పట్టుకున్నది
ఎస్సారెస్పీ కాల్వ కింద మాకు 12 ఎకరాలు సాగు అయితుండె. మూడేండ్లుగా రెండు కార్లు సగం పత్తి, సగం వరి సాగు చేస్తున్నాం. ఈసారి నీళ్లు వస్తాయో లేదోనని ఆరు ఎకరాల్లోనే వరి సాగు చేశాం. నాట్లు వేసి 45 రోజులైంది. గత వారం ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు వదిలిందని విన్నాం. మా దగ్గర ఎస్సారెస్పీ మెయిన్ కాల్వకు మాత్రం నీళ్లు రాలె. మళ్లీ పాత రోజులు వస్తాయన్న భయం పట్టుకున్నది.
-పందిరి అంజిరెడ్డి, రైతు, గాజులమల్కాపురం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
ఎకరం పంట ఎండిపోయింది
పాత కాలువ కింద నీరిస్తారని మూడెకరాల్లో వరి పంట వేశాను. నీరు లేకపోవడంతో ఎకరం పంట ఎండిపోయింది. రెండు తడులకైనా నీరిస్తే బయటపడతాం. సాగర్ నుంచి నీళ్లు రాకపోవడంతో ఈసారి యాసంగి, వానకాలం పంటకు తిప్పలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. లేకపోతే యాసంగి పంట బుగ్గి పాలవటం ఖాయం.
-దేవర అనిల్, రైతు, పెరికసింగారం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతులను ఆగం చేయొద్దు
ప్రాజెక్టులు దెబ్బతిన్నయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తున్నది. ఇప్పుడు ఎండలు ముదిరినయి. ఆలస్యంగా నాట్లు వేసేసరికి చివరి పొలాలలకు నీరు అందుతుందో లేదో అని భయపడుతున్నం. నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్ నీటి విడుదల, పంటల సాగుపై అడ్డదిడ్డంగా మాట్లాడుతూ రైతులను ఆగం చేస్తుండు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు, రైతులను ఆదుకోవాలి.
– శ్రీను, రైతు, ఎల్లాయగూడెం, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా
నోటికాడికొచ్చిన వరిపంట ఎండిపోయింది
ఈ ఏడు నీళ్లు సరిగ్గా ఉండవనే అందరికంటే ముందుగా నాటేసిన. నాకున్న బాయి, రెండు బోర్లు పూర్తిగా అడుగంటినయ్. దీంతోటి నేనేసిన రెండెకరాల వరిపంట ఎండిపోయింది. పొట్టకొచ్చి గొలుసులు వేస్తున్నప్పుడే నీళ్లందకపోవటంతో ఇడిసిపెట్టిన. నోట్లెకొచ్చిన పంట ఎండిపోతుంటే చూడలేకపోతున్నా. పదేండ్ల నుంచి నా పంట ఎన్నడూ ఎండిపోలె. కొంచెం కీరదోస పెట్టినప్పటికీ దానికీ పారకం లేదు. ఈ యాసంగి పంటతో అప్పుల పాలయ్యేటట్టే ఉన్నా.
-ఇట్టవేని శంకర్, రైతు, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా
నాకు రైతుబంధు ఇంకెప్పుడస్తదో!
ఐదు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీజన్ సమయానికి రైతుబంధు సాయం అందేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాకు ఇంతవరకూ రైతుబంధు సాయం అందలేదు. ఇప్పటిదాకా నాలుగు ఎకరాల్లోపు వారికి మాత్రమే రైతుబంధు వేశారంట. నాకు ఎప్పుడొస్తుందో, ఏమో! రైతుబంధు రాక, చేతిలో పెట్టుబడి లేక ఈసారి యాసంగి పంటలు వేయలేదు.
– బడుగు నరసింహారావు, రైతు, నాయకులగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రూ.70 వేల నష్టం వాటిళ్లనున్నది
ఆరు ఎకరాల్లో బోర్ల కింద వరి పొలం వేశాను. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. నా పొలం రెండెకరాల మేర ఎండిపోతున్నది. అంటే ఈ లెక్కన సుమారు రూ.70 వేల నష్టం వాటిళ్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలి. లేకుంటే అన్నదాతల బతుకులు ఆగం అయితయి.
– జెర్రిపోతుల విష్ణు, రైతు, మొల్కపట్నం, వేములపల్లి మండలం, నల్లగొండ జిల్లా
పంట చేతికి వచ్చుడు కష్టమే
నాకు మూడెకరాల పొలం ఉంటే ఎకరంలో మక్క జొన్న పంట వేసిన. నీళ్లు లేక అది కూడా పండేలా లేదు. బోరు రోజురోజుకూ తగ్గుతున్నది. కొత్త బోర్లు వేసినా నీళ్లు వస్తలేవు. కష్టపడి చేసినదంతా చేతికి రాకుండా పోతున్నది. నీళ్లు లేక మా ప్రాంతంలో చాలా మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ యాసంగి రైతుకు పెద్ద దెబ్బ. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
– ఉమ్మెనమోని నాగశేషి,రైతు, ఏదుట్ల, గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా