సిటీబ్యూరో: నీట్లో అవకతవకలపై ఉద్యమిస్తున్న విద్యార్థి, యువతపై దాష్టీకానికి పాల్పడుతున్న మోడీ సర్కారుపై నిరసన గళమెత్తేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. విద్యార్థులపై ఢిల్లీ సర్కారు అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థులకు సంఘీ భావంగా పోరుబాట పట్టనున్నది. ఈ మేరకు శుక్రవారం ఇందిరాపార్క్లో పార్టీ విద్యార్థి విభాగం(బీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జరిగే నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. తన 50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన.. విద్యార్థి ఉద్యమానికి అండగా నిలువనున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో తీసుకువచ్చే సంస్కరణలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతపై కేంద్ర ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ కోరారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరసన కార్యక్రమం ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు.