సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 23: సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్రావు ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపాదిత ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ భాగంగా జహీరాబాద్, సంగారెడ్డిలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్కు అత్యంత సమీప జిల్లా కేంద్రం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఔషధ పరిశ్రమలు, జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరిపాలన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. రేక్ పాయింట్ ద్వారా వ్యవసాయ, ఎరువులు, ధాన్యం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం అవుతాయని చెప్పారు.
రవాణా వ్యయాలు తగ్గి పరిశ్రమల పోటీతత్వం పెరగడంతో పాటు రైతులు, వ్యాపారులు ప్రత్యక్షంగా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. దేశంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న జహీరాబాద్లో 12,656 ఎకరాల్లో నిమ్జ్, జహీరాబాద్ ఇండస్ట్ట్రియల్ స్మార్ట్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు అమలవుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అత్యంత అవసరమని వివరించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యేలు వెల్లడించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ ఉన్నారు.