గద్వాల : ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి కింద ప్రతి పంటకు ఎకరాకు రూ. 5వేలు ఇస్తున్నారని తెలిపారు.
రైతు బీమా అందజేస్తూ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని వెల్లడించారు. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2022 నాటికి 64 లక్షల మంది రైతులకు రైతుబంధు సకాలంలో అందుతున్నదని మంత్రి తెలిపారు. రైతు సర్కార్గా పేరుగాంచిన తెలంగాణ ప్రభుత్వం నిరంతరం రైతుల అభివృద్ధికే పనిచేస్తుందని అన్నారు.
రైతులకు సముచిత స్థానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులు నిలదొక్కుకున్నారని తెలిపారు.రైతులకు రైతుబంధు, కుల వృత్తులకు, మత్స్యకారులకు రుణాలు, దళితులకు దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని తెలిపారు.
ముండుగా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ శ్రీధర్ గౌడ్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వి యం.అబ్రహం, వినియోగ దారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మన్ బి ఎస్ కేశవ్, గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వైస్ చైర్మన్ సరోజమ్మ పాల్గొన్నారు.