తెచ్చేవరకు నేను తెచ్చిన. తెచ్చిన తరువాత మీరు ఆశీర్వచనం ఇస్తే ఇండియాలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. ఇవన్నీ ఇదే విధంగా కొనసాగాలె. నేను కలలుగన్న బంగారు తెలంగాణ కచ్చితంగా తయారైతది. జోష్గా డైలాగ్ కొట్టి, కేసీఆర్ జిందాబాద్ అని పోవుడు కాదు. వివేచనతోని, వివేకంతోని మనమందరం ఆలోచన చేయాలె, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలె. ఇయ్యాల తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. జారిపోతే చాలా చాలా కష్టం వస్తది. మంది మాటలు నమ్మి పోతే ఏదో అయిందన్నట్టుగా.. ఉన్నది అమ్ముకొనే పరిస్థితి వస్తది.
– సీఎం కేసీఆర్..
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకొంటున్నామని వివరించారు. ఇలాంటి ప్రగతిశీల రాష్ర్టాన్ని మళ్లీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా, పరిస్థితులు దిగజారకుండా కాపాడుకోవాల్సిన అవసరమున్నదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతి గ్రామంలో వివేచనతో.. వివేకంతో చర్చ చేయాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
వికారాబాద్కా హవా.. లాఖోం మరీజోంకా దవా
తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తాండూరు, పరిగి, వికారాబాద్కు ఎప్పుడు వచ్చినా.. రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టండి అని అడిగేవారు. దేవుడి దయవల్ల తెలంగాణ వస్తే వికారాబాద్నే జిల్లా చేసుకొందాం అని ఆనాడు చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను జిల్లా చేసుకొన్నం. అద్భుతమైన కలెక్టరేట్ను నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభింపజేసుకొన్నందుకు జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు నా శుభాకాంక్షలు. వికారాబాద్కు గొప్ప చరిత్ర ఉన్నది. అనంతగిరి కొండల్లోని ఔషధుల వల్ల ఈ ప్రాంతానికి దేశవ్యాప్త ప్రశస్తి ఉన్నది. గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది. ‘వికారాబాద్కా హవా.. లాఖోం మరీజోంకా దవా’ అని చెప్పుకొనే గొప్ప చరిత్ర ఈ పట్టణానిది. ఇప్పుడు వికారాబాద్కు మెడికల్, డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. సభలో ఉన్న పెద్దలు ఆలోచన చేయాలె.. ఊరికి పోయిన తర్వాత చర్చ పెట్టాలె. తెలంగాణ రాకుంటే.. మన జన్మలో వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఈ జిల్లాలో రూ.50 కోట్లు ఖర్చుపెట్టి ఇంత సుందరమైన కలెక్టరేట్ నిర్మించుకొంటమని అనుకొన్నమా? ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ వచ్చేదా? యాభై ఏండ్ల పాలనలో ఎవరూ ఆలోచించని డిగ్రీ కాలేజీ వచ్చేదా? 33 జిల్లాల్లో కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నం. మన పిల్లలు చదువుకొని పైకి రావాలె.
అమెరికాతో, లండన్తో పోటీపడే స్థాయికి పోవాలె. నేను రాష్ట్రం కోసం తిరిగినప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్న సమైక్యవాదుల తొత్తులు తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతయని ప్రచారం చేసిన్రు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్న. రాష్ట్రంలో అత్యధిక ధరలున్న భూములు కలిగి ఉన్నవి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు. కర్ణాటక, ఏపీ కంటే మన భూముల ధరలు ఎక్కువ. ఒకనాడు వలసవాదులు అక్కడ ఎకరం అమ్మి ఇక్కడ మూడునాలుగెకరాలు కొన్నరు. ఇయ్యాల తెలంగాణలో రైతులు ఎకరం అమ్మి ఇతర రాష్ర్టాల్లో కొంటున్నరు. ఇది మనందరికీ గర్వకారణం.
ఎట్లున్న తెలంగాణ.. ఎట్లా అయ్యింది?
తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు ప్రతి ఊళ్లో, ప్రతి ఇంట్లో జరుగుతున్నయి. గతంలో పరిస్థితులు ఎట్లా ఉండేవో మీకు తెలుసు. ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీరు గమనించాలె. అనేక రకాల మాటలు చెప్పేవాళ్లు ఉంటరు. కానీ, వాస్తవాలను ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చైతన్యంతో చర్చించాలె. దాని ప్రకారమే నిర్ణయాలు ఉండాలె. 58 ఏండ్లు అనేక బాధలు పడ్డది తెలంగాణ. రాష్ట్రంకోసం గతంలో ఉద్యమాలు జరిగినా, పిల్లలు చనిపోయినా ఫలితం రాకపోగా సమైక్య శక్తులు గెలిచినయి. ఇదే వికారాబాద్ ప్రాంతంలో పాత రంగారెడ్డి జిల్లాలో ఎండకాలం వస్తే మంచినీళ్ల కోసం గోసపడ్డం. ఈ రోజు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు గతంలో రూ.200 పెన్షన్ వస్తే.. ఇప్పుడు రూ.2,016 ఠంచనుగా ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నం. ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. మంచినీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. హాస్పిటళ్లలో ఏ విధంగా ప్రసవాలు అవుతున్నయో.. కేసీఆర్ కిట్ ఎట్లా ఇస్తున్నరో మీ కండ్ల ముంగటనే ఉన్నయి. ఈ స్కీములు ఏ రాష్ట్రంలోనూ లేవు. మీ పొరుగునే ఉన్న కర్ణాటకలోని రాయచూర్ ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి.. లేదా అక్కడి పథకాలనైనా అమలు చేయండని వాళ్ల ఎమ్మెల్యేలను అడుగుతున్రు. తాండూరు ప్రజలకు ఇవన్నీ బాగా తెలుసు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మీ మీ నియోజకవర్గాల నుంచి ఒక 500 మంది మహిళలు, 500 మంది పురుషులను కర్ణాటక సరిహద్దులకు తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను చూపించాలని కోరుతున్నా. అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అక్కడ పేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు పైసలిస్తున్నరా? గురుకులాలు ఉన్నయా? 24 గంటల కరెంటు ఇస్తున్నరా? పెన్షన్ ఎంతిస్తున్నరు? అన్నీ చూపించండి. మీకే అర్థమవుతుంది. బీజేపీ పాలిత కర్ణాటక గతి కావాల్నా? ఆలోచించండి.
రైతులను ఆదుకొన్నం
గతంలో నీళ్లు లేక, కరెంటు లేక, భూగర్భ జలాలు పడిపోయి.. పది, ఇరవై ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కు వచ్చి ఆటోలు నడుపుకొన్న పరిస్థితి ఉండె. ఇప్పుడు పల్లె ప్రగతితో పల్లెసీమలన్నీ పచ్చని చెట్లతో అన్ని రకాల హంగులతో అలరారుతున్నయి. గూడు చెదిరి చెట్టుకొకరు.. పుట్టకొకరు అయిన తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలె. వ్యవసాయ స్థిరీకరణ జరిగి ప్రతి ఒక్కరికీ పని దొరకాలన్న సంకల్పంతో అనేక రైతు కార్యక్రమాలు చేస్తున్నం. ఎకరానికి రూ.10 వేల పంట పెట్టుబడి తీసుకొంటున్న రైతు తెలంగాణ రైతు మాత్రమే. గతంలో రైతులు చనిపోతే.. ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. అది కూడా ఆరేడు నెలలు కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే.. అందులో పదో, ఇరవై వేలో ఇచ్చి మిగతావి మేసేవాళ్లే మేసేటోళ్లు. ఇప్పుడు రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నం. ఇది తెలంగాణ ఆవిష్కరించిన అద్భుత పథకం. ఇలాంటిది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రైతులకు ఉచిత కరెంటే కాదు.. ప్రాజెక్టులున్న చోట కాల్వల ద్వారా ఎటువంటి పన్నులు లేకుండా ఫ్రీగా నీళ్లు ఇస్తున్నం. గతంలో నీటి పన్ను బకాయిలు మాఫీ చేసినం. ఇవన్నీ ఆషామాషీగా రాలేదు.
మీ కండ్ల ముంగట ఉన్నయే ఇవి. భవిష్యత్తులో ఇంకా చాలా చేసుకొనే అవకాశాలు ఉన్నయి. మనం ఎప్పుడన్నా మోసపోతే.. గోసపడే పరిస్థితులు వస్తయి. దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా.. పాత పద్ధతికి పోకుండా, పరిస్థితులు మళ్లీ దిగజారకుండా.. వాళ్ల స్వార్థ రాజకీయాలకు మనం బలికాకుం డా మేధావులు, బుద్ధి జీవులు, పెద్దలు తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ము ఖ్యంగా ఆడబిడ్డలు, తల్లులు ఈ తెలంగాణను కడుపులో పెట్టుకొని కాపాడాలని కోరుతున్న. రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటదో.. రాజకీయంగా నిద్రపోయి ఉంటదో.. సమాజం గురించి ఆలోచించమో.. అప్పుడే మనం దోపిడీకి గురవుతాం. ఇదివరకు 58 ఏండ్లు సమైక్య పాలకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి కొట్టుకుని సచ్చిపోయినం. పెరుగన్నం తినే రైతులు పురుగుల మందు తాగి చనిపోయిండ్రు. మళ్లీ ఆ బాధలు మన తెలంగాణకు రావొద్దంటే మన సమాజం.. ముఖ్యంగా మన యువత అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణ ఉట్టిగనే రాలేదు
ఇయ్యాల ఎవడు పడితే వాడు.. ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఉద్యమం జరిగిన్నాడు.. గడ్డలమీద కూర్చున్నోళ్లు, మన బాధ చూడనోళ్లు, మన అవస్థలను పట్టించుకోనోళ్లు, మనల్ని చూసి నవ్వినోళ్లు ఇయ్యాల అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు. తెలంగాణ ఉద్యమం జరిగిననాడు అటుకులు తిన్నమో, అన్నం తిన్నమో, ఉపాసం ఉన్నమో.. 14 ఏండ్లు పంటి బిగువున భరించి పోరాటం చేసినం. చివరకు నేను ఆమరణ నిరాహార దీక్ష పట్టి చావు అంచుదాకా వెళ్లి రాష్ర్టాన్ని తెచ్చుకొన్నం. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే. తెచ్చేవరకు నేను తెచ్చిన. తెచ్చిన తరువాత మీరు ఆశీర్వచనం ఇస్తే ఇండియాలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నం. ఇవన్నీ ఇదేవిధంగా కొనసాగాలె. నేను కలలు గన్న బంగారు తెలంగాణ కచ్చితంగా తయారైతది. జోష్గా డైలాగ్ కొట్టి, కేసీఆర్ జిందాబాద్ అని పోవుడు కాదు. నేను చెప్పే మాటలపై తీవ్రంగా ఆలోచన చేయాలె. నేను చెప్పింది నిజమా? కాదా? అని ఊర్లెకు పోయి చర్చ చేయాలె. వివేచనతోని, వివేకంతోని మనమందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలె. ఇయ్యా ల తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. జారిపోతే చాలా చాలా కష్టం వస్తది. మంది మాటలు నమ్మి పోతే ఏదో అయిందన్నట్టుగా.. ఉన్నది అమ్ముకొనే పరిస్థితి వస్తది.