అమలు కోసం అన్ని రాష్ర్టాల్లో ఒత్తిడి
అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమం
రైతుబంధు కేసీఆర్కు ధన్యవాదాలు
మద్దతు ధర చట్టం కోసం పోరాటం
జాతీయ రైతు సంఘాల తీర్మానం
ఢిల్లీలో అన్ని రాష్ర్టాల రైతు నేతల భేటీ
హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ)/ఆర్మూర్: తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలోని రాకాబ్గంజ్ గురుద్వార్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ ఆధ్వర్యంలో శివకుమార్ కకాజీ అధ్యక్షతన జాతీయ స్థాయి రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మద్ద తు ధరకు ధాన్యం కొనుగోలు తదితర పథకాల గురించి దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు వివరించారు. ఇతర రాష్ర్టాలు కూడా ఇలాంటి పథకాలను అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కోటపాటితో ఏకీభవించిన రైతు సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను అభినందించారు. ఇతర రాష్ర్టాల్లో కూడా తెలంగాణ మాడల్ రైతు పథకాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రైతులకు మేలు జరిగేలా విప్లవాత్మకమైన వ్యవసాయ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదించారు.
మద్దతు ధర చట్టానికి పోరాటం
రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం రూపొందించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి చేయాలని రైతు సంఘాల సమావేశం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన హామీని నిలుపుకోని పక్షంలో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. సుదీర్ఘకాలం సాగిన రైతు పోరాటంతో నల్లచట్టాలను ఉపసంహరించుకొన్న కేంద్రం.. మద్దతు ధర చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఇంతవరకు అడుగు ముందుకుపడలేదు. ఈ నేపథ్యంలో మద్దతు ధర చట్టం కోసం మరో పోరాటం చేయాలని నిర్ణయించారు. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నుంచి వైదొలగాలని తీర్మానించారు. సమావేశంలో శాంతకుమార్, దైవరాజ్ (కర్ణాటక), కేవీ బిజు (కేరళ),రెంయి బబ్లుసింగ్ (రాజస్థాన్), విజయ్సింగ్ ధబాన్ (ఢిల్లీ), సురేశ్కుమార్ సిల్లీర్ (పంజాబ్), బల్దేవ్సింగ్, మన్మోహన్సింగ్, త్రిలోక్ కొట్టి (మధ్యప్రదేశ్), దేశ్పాజే (హర్యానా), పంజాబ్కు చెందిన మహిళా రైతు రాబ్వీందర్కౌర్ తదితరులు పాల్గొన్నారు.