KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మీడియా ముఖంగా బదులిచ్చేందుకు ఇరిగేషన్శాఖ సెక్రటరీ రాహుల్బొజ్జా ముఖం చాటేశారు. విలేకరుల సమావేశముంటుందని ఆహ్వానించి, తుదకు అదేమీ లేకుండానే ప్రెస్నోట్ మాత్రం రిలీజ్ చేశారు. ప్రాజెక్టులను అప్పగించామని వస్తున్న వార్తలు అవాస్తమని చెబుతూనే, గతంలోనే ఇలాంటి ప్రతిపాదనలు జరిగాయని ఉటంకిస్తూ సమర్థించుకునే యత్నం చేశారు తప్ప అసలు బోర్డుకు అప్పగించారా? లేదా? అనే ప్రశ్నలకు సూటిగా బదులివ్వలేదు. గత 9 ఏండ్లుగా కేంద్రం ఎదుట తెలంగాణ పెడుతున్న డిమాండ్లనే మరోసారి ఆ ప్రకటనలో ఏకరువు పెట్టారు.
ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17వ కేంద్ర జల్శక్తిశాఖ సమావేశానికి కొనసాగింపుగా గురువారం కేఆర్ఎంబీ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్తు ప్రాజెక్టులు మినహా మిగతా కృష్ణా ప్రాజెక్టులు, ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ సర్కారు అంగీకారం తెలిపింది. ఇదే విషయాన్ని ఈఎన్సీ మురళీధర్ పత్రికాముఖంగా వెల్లడించారు. అయితే అదంతా అవాస్తమని తాజాగా ఇరిగేషన్శాఖ సెక్రటరీ రాహుల్బొజ్జా కొట్టిపారేశారు. శుక్రవారం ఆయన విడుదలచేసిన ప్రకటనలో కెఆర్ఎంబీ సమావేశ వివరాలను పత్రికలే తప్పుగా ప్రచురించాయని, ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నామని, తెలంగాణ ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో తెలంగాణ తరపున ఈఎన్సీ మురళీధర్ హాజరై ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం పెట్టిన పలు ముందస్తు షరతులను వివరించారని పేర్కొన్నారు.
నీటి పంపిణీ 50:50 నిష్పత్తిలో జరగాలని, బేసిన్ ప్రాంతాల అవసరాలకే ప్రాధాన్యనివ్వాలని, శ్రీశైలం ఎండీడీఎల్ 830 అడుగులే ఉండాలని, ప్లానింగ్ కమిషన్ నిర్దేశించిన విధంగా నాగార్జునసాగర్ జలాశయానికి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 264 టీఎంసీల నీటిని తరలించాలని, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ని 34 టీఎంసీలకే కట్టడి చేయాలని, తాగునీటి కోసం వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెకలోకి తీసుకోవాలని, ఒక వాటర్ ఇయర్లో దాచుకున్న నీటిని తర్వాతి వాటర్ ఇయర్లో వాడుకోవడానికి అనుమతించాలని, ఆయా అంశాలను అపెక్స్ కౌన్సిల్కు నివేదించాలని 17వ బోర్డు మీటింగ్లో తెలంగాణ విజ్ఞప్తి చేసిందని కేఆర్ఎంబీకి తెలిపారని రాహుల్బొజ్జా వెల్లడించారు. విద్యుత్తు కేంద్రాలు మినహా మిగతా 10 ఔట్లెట్స్ను అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి పొందాల్సిన ఉంటుందని బోర్డుకు ఈఎన్సీ తెలిపారని చెప్పారు. 10 ఔట్లెట్స్ ద్వారా త్రిసభ్య కమిటీ నిర్ణయించిన మేరకు నీటి విడుదల, నీటి నిర్వాహణ మాత్రమే కేఆర్ఎంబీ బాధ్యత, డ్యామ్ల నిర్వాహణ ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని బోర్డుకు స్పష్టం చేశారని, అవే అంశాలను పత్రికలకు సైతం ఈఎన్సీ స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు. లేఖలోని అంశాలకు, ఈఎన్సీ పత్రికలకు వివరించిన అంశాలకు మధ్య ఏ వైరుధ్యం లేదని, అయినా కూడా ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ధారాదత్తం చేసిందని, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిందని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. 17 న ఢిల్లీలో జరిగిన సమావేశం, 19న కేంద్ర మంత్రిత్వశాఖ జారీ చేసిన మినిట్స్పై కూడా ఇలాగే ప్రచురించాయని తప్పుబట్టారు. ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రతినిధులు అంగీకరించలేదని, చర్చల వివరాలను ప్రభుత్వానికి విన్నవించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పామని పేర్కొన్నారు.
ఇదే అంశంపై మీడియాతో నేరుగా మాట్లాడేందుకు రాహుల్బొజ్జా నిరాకరించడం గమనార్హం. వాస్తవంగా ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్బొజ్జా పత్రికా సమావేశముంటుందని ఇరిగేషన్ కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం అందించింది. దీంతో మీడియా ప్రతినిధులందరూ ఎర్రమంజిల్లోని జలసౌధకు వెళ్లారు. అయితే టీవీ చానళ్ల ముందు మాట్లాడేందుకు, ఫొటోలు తీసేందుకు రాహుల్బొజ్జా నిరాకరించారు. అవేవీ లేకుండానే రిపోర్టర్లతో నేరుగా కొద్దిసేపు మాట్లాడారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారా? లేదా? అనే విషయాన్ని సూటిగా చెప్పాలని పాత్రికేయులు పలుమార్లు అడిగినా ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. మినిట్స్ను తప్పుగా నమోదు చేశారని కేంద్రానికి లేఖ రాశామని ఏకరువు పెట్టారు తప్ప ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఉద్యోగులను బోర్డుకు అప్పగించడమంటే ప్రాజెక్టులను అప్పగించినట్టే కదా? అని ప్రశ్నించినా బదులివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ను జారీచేసిన తర్వాత ఇరు రాష్ట్రాలకు చెందిన కామన్ ప్రాజెక్టులను మాత్రమే కేఆర్ఎంబీకి అప్పగిస్తామని గత ప్రభుత్వమే సూత్రప్రాయంగా అంగీకరించిందని, అవసరమైన రూ.200 కోట్ల సీడ్ మనీని కేఆర్ఎంబీకి చెల్లించడం కోసం 2023-24 రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిందని వెల్లడించడం కొసమెరుపు. ఇదే విషయమైన నాటి ప్రభుత్వ నిర్ణయం మేరకే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించిందా? అని ప్రశ్నించగా రాహుల్బొజ్జా జవాబివ్వలేదు. ఇవే అంశాలను మీడియా ఎదుటనే చెప్పాలని కోరినా అందుకు నిరాకరించడంతోపాటు, ఈఎన్సీ మురళీధర్ వివరిస్తారని చెప్పి వెళ్లిపోయారు. అటు తరువాత ప్రెస్నోట్ విడుదల చేశారు.