కొత్తపల్లి, ఏప్రిల్ 28: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి చేరవేయడంతోపాటు వాటిని సమర్ధవంతంగా అమలు చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన డీఎలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదేండ్లకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగుణంగా అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
2023 జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ జాడలేదని, గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటీరియమ్ రిలీఫ్తోనే ఉద్యోగులకు సరిపెట్టడం జరుగుతుందని మండిపడ్డారు. 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు రావాల్సిన ఐదు డీఎలను పెండింగ్లో ఉంచడం అన్యాయమని వాపోయారు. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్ బిల్లులు, టీజీఎల్ఐఎఫ్ ఇన్సూరెన్స్ బిల్లులు, ఏరియర్స్ సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని చెప్పారు. ఓపీఎస్ పునురుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హెల్త్కార్డ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని, ఎంపానెల్ట్ హాస్పిటల్స్ను ఖరారు చేయకపోవడం వల్ల ఉద్యోగులు వైద్యసేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.