హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించింది. చలో హైదరాబాద్ రద్దు, వాయిదా పుకార్లను జేఏసీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను ఉద్యోగులు నమ్మవద్దని సూచించింది. తాము ఉద్యమం విషయంలో వెనక్కి తగ్గేదిలేదని, ఈ నెల 10న తలపెట్టిన ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’ జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. సర్కార్తో చర్చల నేపథ్యంలో సోమవారం జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. చర్చలు అసంపూర్తిగా ముగియడం, ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. పీఆర్సీ, డీఏలకు ఇంకా రెండేండ్లు ఆగాలన్న సీఎం వ్యాఖ్యలపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచిపోయింది. ఇంకా రెం డేండ్లు ఆగితే ఇచ్చేదేముందని ప్రశ్నించారు.
ఉద్యోగుల హక్కుల సాధన సభకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(లచ్చిరెడ్డి) మద్దతు ప్రకటించింది. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జేఏసీ నేతలతో భేటీ అయిన లచ్చిరెడ్డి చలో హైదరాబాద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆహ్వానం మేరకు మద్దతిచ్చినట్టు జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్ ప్రకటించారు.