హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ క్యాలెండర్-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ప్రశంసించారు. తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతా జరగాలని సంక్షేమ పథకాలు అమలు కావాలని అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
317 జీవో ద్వారా ఏర్పడిన సమస్యలు, స్పౌజ్ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు విద్యావంతులుగా సరైన అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని కోరారు. మతోన్మాద శక్తుల ఉచ్చులో పడవద్దని అన్నారు. ఇటీవల పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయునిపై దాడి హేయమైన చర్య అని, దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. భారతదేశాన్ని రాజ్యాంగం లౌకిక రాజ్యంగా అభివర్ణించిందని గుర్తు చేశారు. అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలనేదే రాజ్యాంగ మౌలిక సూత్రమని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్, ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, జిల్లా సమన్వయకర్త మహమ్మద్ ఫయాజ్ అలీ, రాష్ట్ర చైర్మన్ ఏ పద్మాచారి, రాష్ట్ర అధ్యక్షులు ఎం రవీంద్ర కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్రోజు రమేశ్, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి రాం దామోదర్ రావు, జిల్లా నాయకులు బండ శ్రీనివాస్, కర్నే రవీందర్, కామ శ్రీనివాస్, పీ సత్యనారాయణ, నాగరాజు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.