హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణి ఉన్నత విద్యకు గాను రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో అత్యున్నత విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
దాంతోపాటు విదేశీ విద్యకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనుండటం, బాలబాలికల ఉన్నత భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తుందని కవిత తెలిపారు.
జయచంద్రిక బాల్యం నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ వేళ తెలంగాణ తల్లి వేషాధరణతో జయచంద్రిక ప్రతి సమావేశంలోనూ ఆకర్షణీయంగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు. జయచంద్రికకు ఆర్థిక సాయం అందించిన మణికొండ రంజిత్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.