న్యూఢిల్లీ, జూలై 19: నీట్ పేపర్ లీకేజీతో కేంద్రం తిరిగి నిర్వహించిన రీ-నీట్తో కూడా విద్యార్థుల కష్టాలు ఆగడం లేదు. ఈనెల 16న రీ-నీట్ 2026 ఫలితాలు వెలువడగా, మార్కుల్లో పలు అవకతవకలు కన్పించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా తాము ఆశించిన మార్కులకు, స్కోర్కార్డుల్లోని మార్కులకు ఎంతమాత్రం పొంతన లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. నీట్లో 720 మార్కులకు 638 వస్తాయని ఫైనర్ ఆన్సర్ కీని బట్టి ఆశించానని, తీరా స్కోర్ కార్డులో 38 మాత్రమే వచ్చాయని ప్రతిభా త్రివేది అనే విద్యార్థిని వాపోయింది. ఆశించిన దానికి, వచ్చిన మార్కులకు ఐదో, పదో తేడా ఉండటం సహజమని, మరీ ఇంత వ్యత్యాసమా అని ఆమె ప్రశ్నించింది. దీంతో తన ఓఎంఆర్ షీట్ను పరిశీలించాలంటూ కేంద్ర విద్యా శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ)కు విజ్ఞప్తి చేసినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. సుమారు 600 మంది అభ్యర్థులు తనలాగే మార్కుల తేడా వచ్చి బాధపడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
విద్యార్థులకు ఎన్టీఏ హెచ్చరికలు
ఫిర్యాదుతో సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు ఏఐ సాధనాలను ఉపయోగించి మార్చినట్టు కన్పిస్తున్నాయని ఎన్టీఏ ఆరోపించింది. స్కోర్ల తేడాకు సంబంధించి చేసే ఫిర్యాదుల్లో ఏఐ సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించ వద్దంటూ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులను హెచ్చరించింది.
తప్పు సరిదిద్దకుండా బెదిరింపులా?
తాము చేసిన తప్పులను సరిదిద్దకుండా అభ్యర్థులను ఎన్టీఏ బెదిరించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. రీ-నీట్లో ఫలితాల్లో కూడా పలు అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ‘తాము అనుకున్న మార్కులకు వచ్చిన మార్కులకు చాలా తేడా ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పుడు వారంతా ఎక్కడికి వెళ్లాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ఏఐ సృష్టించిన ఓఎంఆర్ షీట్లను ప్రచారం చేస్తూ ఎన్టీఏ బెదిరిస్తున్నదన్నారు.
వృద్ధులకు ఎంబీబీఎస్లో రిజర్వేషన్లు లేవెందుకు?
వైద్య విద్యలో వృద్ధులకు ప్రత్యేక రిజర్వేషన్ లేదా ప్రత్యేక కోటా అమలు చేయాలని 71 ఏండ్ల నీట్ యూజీ-2026 అభ్యర్థి అశోక్ బహర్ అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ను ఆశ్రయించారు. అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఎంబీబీఎస్ ప్రవేశాల్లో 1 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైద్య విద్య ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు వృద్ధులకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. నీట్ రాయడానికి వయో పరిమితి లేనప్పుడు, వృద్ధులకు కూడా మెడికల్ సీట్ పొందడానికి సరైన అవకాశం ఉండాలని వాదించారు. ఈ నెల 21న ఈ పిటిషన్ విచారణకు రానుంది.