హైదరాబాద్, ఆగస్టు 28: నేరాల దర్యాప్తు, పోలీసింగ్లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా.. ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని డీజీపీ సూచించారు. అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో సీసీటీఎన్ఎస్పై ప్రత్యేకంగా దృష్టి సారించడం మూలంగా గతంలో 70–80 శాతంగా ఉన్న సీసీటీఎన్ఎస్ డేటా అప్డేట్.. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు.
క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ను పాటించడాన్ని అధికారులు పోటీగా తీసుకోవాలని అన్నారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్స్పెక్షన్ నోట్స్ను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాల పర్యటనలు, పోలీస్స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో 7.15% పెరిగిన నేరాలు
రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య మూడేళ్లలో 7.15 శాతం పెరిగింది. 2023-24లో 2,65,377 కేసులు నమోదుకాగా.. 2025-26లో 2,84,363కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. మూడేళ్లలో 46.10 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే తీవ్ర నేరాలు గణనీయంగా తగ్గాయి. 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా.. 2025-26లో 6,294కు తగ్గాయి. ఏడాది వ్యవధిలో 10.33 శాతం తగ్గుదల నమోదైంది. లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కు తగ్గింది. తీవ్ర నేరాలు తగ్గుతున్నప్పటికీ సాధారణ నేరాలు (నాన్-గ్రేవ్) మాత్రం పెరుగుతున్నాయి. 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు 2025-26లో 2,78,069కు చేరాయి. మూడేళ్లలో 7.28 శాతం పెరుగుదల నమోదైంది. మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాలు పెరిగాయి.
మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో నార్కోటిక్ కేసుల పెరుగుదల పోలీస్ శాఖకు ప్రధాన సవాలుగా మారుతోంది. 2023-24లో 2,026 కేసులు ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. కమిషనరేట్లలో సైబరాబాద్లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. 2024-25లో 31,593గా ఉన్న మహిళలు, చిన్నారులపై నేరాలు 2025-26లో 31,108కు తగ్గాయి. ఏడాదిలో 1.54 శాతం క్షీణత నమోదైంది. అయితే 2023-24తో పోలిస్తే 3.81 శాతం ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ట్రాఫిక్ నేరాలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. 2023-24లో 29,130 కేసులు ఉండగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయి.
సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట
సైబర్ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు విభాగాల్లో మూడేళ్ల కాలానికి తగ్గుదల కనిపించడం సానుకూల పరిణామంగా పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైంది.