కామారెడ్డి: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, తాగునీరు మెరుగుపడ్డాయని చెప్పారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రమంతటా అద్భుతాలు జరిగాయని వెల్లడించారు. కామారెడ్డి పర్యటనలో ఉన్న తలసాని మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. గ్రామీణ వ్యవస్థ, కులసంఘాలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పండుగలు విశ్వవ్యాప్తంగా జరుపుకునే విధంగా మారాయని వెల్లడించారు.
కామారెడ్డి నియోజికవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టమని, అత్యధిక మెజార్టీతో గెలిపించి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టించాలన్నారు. కేసీఆర్ స్వయాన పోటీ చేయడంతో కామారెడ్డి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందనుందని వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓ పార్టీ ప్రజల మధ్య గొడవలు పెంచుతుందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది.. స్వతంత్రం వచ్చిన తర్వాత పాలించింది వారే కదా.. అప్పుడు సాధ్యం కానీ అభివృద్ధి ఇప్పుడు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కర్ణాటక మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. 45, 50 ఏండ్లు పాలించి ఏమీచేయని కాంగ్రెస్ మళ్లీ ఒక అవకాశం ఇవ్వమంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమలుకాని హామీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. మతాల పేరు చెప్పుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూ. 100 కోట్లతో కామారెడ్డి పట్టణంలో అభివృద్ది జరిగిందని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ తర్వాత కూడా మరింత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. ప్రజల అవసరాలు, జీవన ప్రమాణాలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత చేస్తుందో మనం చూస్తున్నామని తెలిపారు. భారత దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం వల్ల వచ్చే 3, 4 ఏండ్లలో కామారెడ్డి రూపురేఖలు మారుతాయన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన, ఊహకందని మెజారిటీని ప్రజలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.