హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలు, దూరదృష్టి, పక్కా ప్రణాళికలు, కార్యదీక్ష, టీఎస్ ఐపాస్ చట్టం అమలుతో పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయన్నారు. నగరంలో శనివారం ముస్లిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ) ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్కు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మత విశ్వాసాలకు గౌరవం ఉందని, గొప్ప సెక్యులర్ రాష్ట్రంగా వర్థిల్లుతున్నదని పేర్కొన్నారు. పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న ముస్లింలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 204 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.29లక్షల వరకు సహకారం అందిస్తున్నామన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం ద్వారా సాయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ కొద్ది ఏండ్లలోనే సుమారు రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
ఫార్మారంగంలో రాష్ట్రానికి ఎదురే లేదని, ఐటీలో బెంగళూరును మించి దూసుకుపోతున్నామన్నారు. సుమారు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ముస్లింలను తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని మంత్రి కొప్పుల చెప్పారు. కార్యక్రమంలో టర్కీ కౌన్సిల్ జనరల్ ఎల్మన్ ఓకన్, ఎంసీసీఐ ఉపాధ్యక్షుడు మహ్మద్ సల్మాన్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, ఇండో -అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి రాంకుమార్ రుద్రా తదితరులు పాల్గొన్నారు.