cs shanti kumari | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. రవీంద్రభారతిలో ఈ నెల 22న నిర్వహించనున్న ‘శోభకృత నామ సంవత్సర (ఉగాది)’ ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్కే భవన్లో గురువారం ఆమె సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.
21, 22న ప్రభుత్వ ప్రధాన భవనాల్లో సూచికలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాలంకరణ చేయాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, టూరిజం, సాంసృతిక శాఖ మఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ దాన కిశోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, డీజీ ఫైర్ సర్వీసెస్ వై నాగిరెడ్డి, భాషా సాంసృతికశాఖ డైరెక్టర్ ఎం హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.