Telangana | హైదరాబాద్ : మిగ్జాం తుపాను కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తమయ్యారు. వర్షాల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, వరద నివారణ చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.