హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ‘ఐటీ అభివృద్ధిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎగుమతుల్లో 299శాతం పెరుగుదల నమోదై, దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ ఒకటి సృష్టించింది. 2023-24 సంవత్సరానికి కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఐటీ ఎగుమతులపై కేంద్రం విడుదల చేసిన లెక్కలే కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ సాధించిన పురోగతిపై సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కేసీఆర్ విజన్-కేటీఆర్ మిషన్ ఐటీకి ఐకాన్’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ పోస్ట్కు ట్యాగ్ చేశారు. 2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో రూ.57,258 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు, బీఆర్ఎస్ సర్కార్ విప్లవాత్మకమైన నిర్ణయాలు, వినూత్న పాలసీలు, కార్యక్రమాలతో 2023-24 నాటికి రూ.2,72,076 కోట్లకు చేరాయని వివరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీ రంగం ప్రగతిపథంలో పురోగమించిందని కేటీఆర్ తెలిపారు.