హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. పేదలకు ప్రభుత్వ దవాఖానల్లోనే కార్పొరేట్స్థాయి సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఆరోగ్య శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి హరీశ్రావు పాల్గొని, సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పూర్తయితే 650 పడకల దవాఖానతోపాటు అందులో ప్రొఫెసర్లు, ఇతర వైద్యసిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ దవాఖానల నియంత్రణకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. నిరుడితో పోల్చితే ఈ సారి హెల్త్ బడ్జెట్ను 8 శాతం పెంచామని పేర్కొన్నారు. కేంద్రం 3.9 శాతం మాత్రమే పెంచిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపు రూ.3,532గా ఉందని, కేంద్రం మాత్రం రూ.766 కేటాయిస్తున్నదని చెప్పారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని హరీశ్రావు పేర్కొన్నారు. బస్తీ దవాఖానల సేవలను ప్రశంసించిన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అభినందించారంటేనే.. రాష్ట్ర ప్రతిష్ఠను సీఎం కేసీఆర్ ఎంతగా పెంచారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో దవాఖాన ప్రసవాలు 99.95 శాతం నమోదవుతున్నాయని, దేశ సగటు 77 శాతం మాత్రమే అని చెప్పారు. ఇది కేసీఆర్ కిట్ అమలు ఘనతగా అభివర్ణించారు.
ఈ ఏడాది నుంచి 33 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు అమలు చేస్తున్నామని, దీంతో 4 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 10 శాతం మంది గర్భిణులకు టిఫా స్కాన్ అవసరమని పేట్లబుర్జు పర్యటన సందర్భంగా గుర్తించామని, వెంటనే రూ.40 లక్షలు విలువ చేసే 56 మెషీన్లు కొనుగోలు చేసి 44 దవాఖానలకు అందజేశామని చెప్పారు. ‘మాది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే ప్రతిపక్షాలది పార్టిషన్ పాలిటిక్స్. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు.. ప్రజల భవిష్యత్తు, భావితరాల గురించి ఆలోచించాలి. అలాంటి కేసీఆర్ సర్కారే ప్రజలకు కావాలి’ అని స్పష్టం చేశారు.
కిడ్నీ పేషెంట్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.వంద కోట్లు ఖర్చు చేస్తున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో 3 డయాలసిస్ కేంద్రాలు ఉంటే వాటిని 104కు పెంచామని వెల్లడించారు. కిడ్నీ రోగులకు ఆసరా పింఛన్లు, బస్ పాస్ ఇచ్చి ఆదుకుంటున్నామని, అవసరమైతే కిడ్నీ మార్పిడి ఉచితంగా చేయిస్తున్నామని, జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 10 వేల మంది కిడ్నీ రోగులు ప్రభుత్వ దవాఖానల్లో సేవలు పొందుతున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నదని చెప్పారు. అవయవ మార్పిడిలాంటి చికిత్సలకు రూ.10 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటివరకు 716 కుటుంబాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు.
సింగరేణి సౌజన్యంతో రామగుండంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఆ కాలేజీలోని ఎంబీబీఎస్ సీట్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. కాలేజీకి సింగరేణి పేరు పెడతామని, ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఒకే ఏడాది 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లు 85 శాతం తెలంగాణ బిడ్డలకే దక్కేలా లోకల్ రిజర్వేషన్ కోటా అమల్లోకి తెచ్చామని చెప్పారు. దీంతో ఈ ఏడాది 8,78,230 నీట్ ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చిందని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన తర్వాత దానిని మొదటిసారిగా అమలు చేసే అవకాశం వైద్యారోగ్య శాఖకు దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కాలేజీలకే నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశారని, దీంతో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎయిమ్స్ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదని, నాలుగేండ్లయినా కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ఆపరేషన్ థియేటర్ లేదు.. ఐపీలు లేవు.. సర్జరీలు లేవు..అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ సభ్యులు సభలో ప్రశ్నలు అడిగి, వాటికి సమాధానాలు వినకుండానే గల్లీ మీటింగ్లలో తెలంగాణ సర్కారును తిట్టేందుకు పోతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వారికి రాజకీయాలే ముఖ్యమని, అభివృద్ధి కంటే గోబెల్స్ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న రాష్ర్టాల్లో 30వ స్థానంలో ఉన్న యూపీకి చెందిన కేంద్ర మంత్రి మహేంద్రసింగ్పాండే ఇటీవల గద్వాల దవాఖానకు వచ్చి మూడో స్థానంలో ఉన్న మనకు నీతులు చెప్పడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆశ వర్కర్లకు అడగకుండానే గౌరవ వేతనం పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. సెకండ్ ఏఎన్ఎంలకు రాష్ట్రంలో రూ.27,599 వేతనం ఇస్తున్నామని తెలిపారు.