అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు
రాహుల్, సోనియా ముందు ఏకరువు
హైదరాబాద్, ఏప్రిల్ 4 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒంటెద్దు పోకడలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ ‘వన్మ్యాన్ షో’ చేస్తున్నాడని, పార్టీ నేతలెవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ సీనియర్లను అవమాని స్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయన తీరుతో పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపారు. రేవంత్ సీనియర్లను లెక్కచేయకుండా పార్టీ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఈ సమావేశం నుంచి వెంకట్రెడ్డి మధ్యలోనే బయటకు వచ్చారు. మరోవైపు సీనియర్ నేత వీ హనుమంతరావు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై, రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్లను లెక్కచేయకపోవడంపై ఆమెకు దాదాపు 30 నిమిషాలపాటు వివరించినట్టు తెలిసింది.