Congress | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందుకు కర్ణాటకలో అన్నభాగ్య పథకమే పరమ నిదర్శనం. ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తామని ఆశచూపి ఓట్లేయించుకొని అందలమెక్కి.. ఇప్పుడు బియ్యం లేవ్ అంటూ తప్పించుకొన్నది. తాజాగా ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అలాంటి హామీయే మరొకటి ఇచ్చారు. అదే చేయూత పథకం.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. మరి ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు. తెలంగాణలో మాత్రమే ఇస్తామని ప్రకటించడం వెనుక ఆ పార్టీ లక్ష్యమేమిటి? అని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్వైఏ (న్యూతమ్ ఆయ్ యోజన) కనీస ఆదాయ పథకం కింద నెలకు రూ.6 వేల పెన్షన్ అందిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. నాడు ప్రజలెవరూ కాంగ్రెస్ హామీని నమ్మలేదు. ఆ తరువాత పలు రాష్ర్టాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పథకాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు మరింత విచిత్రంగా అన్నిరకాల పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని రాహుల్గాంధీ ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటన కాంగ్రెస్ ద్వంద్వ నీతికి, ఏ రోటికాడ ఆ పాట పాడే విధానాలకు అద్దం పడుతున్నదని మేధావులు మండిపడుతున్నారు. రూ.6 వేలు ఇస్తామంటేనే నమ్మని ప్రజలు, రూ.4 వేలు ఇస్తామంటే నమ్ముతారా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ పథకాన్ని ముందు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో పెన్షన్ పథకానికి రూపకల్పన చేశారు. సామాజిక బాధత్యగా అమలు చేస్తున్న ఫలితంగానే నేడు ఆసరా పెన్షన్ పథకం అభాగ్యులకు బతుకు భరోసానిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 11 వర్గాల ప్రజలకు పెన్షన్ అందిస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ రోగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బీడీ కార్మికులకు సైతం పెన్షన్ పథకాన్ని వర్తింపజేసింది. ఆదాయ పరిమితిని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచి ఉదారతగాను చాటుకొన్నది. కాంగ్రెస్ ప్రకటించడానికి ముందే సీఎం కేసీఆర్ ఇటీవలే రాష్ట్రంలోని దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించడం విశేషం. ఈ నెల నుంచి దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ అందనున్నది.
రాష్ర్టానికో తీరు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అన్నిచోట్లా ఒకేరీతిగా పెన్షన్ పథకాలను అమలుచేస్తున్నదా? అంటే అదీ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి అమలు చేస్తున్నది. అర్హుల ఎంపికలో అనేక ఆంక్షలు విధిస్తున్నది. కుటుంబ వార్షికాదాయ పరిమితుల్లో వ్యత్యాసాలను చూపుతున్నది. ఎక్కడా రూ.48- 60 వేల వార్షికాదాయం మించకపోవడం గమనార్హం. నెల సంపాదన రూ.5-6 వేలు దాటితే కుబేరుల కింద లెక్కగట్టి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకే ఇస్తున్నారు. తెలంగాణమాదిరిగా గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, ఒంటరి మహిళలు తదితర భిన్న వర్గాలకు పెన్షన్లు ఇవ్వడం లేదు.
చెరిపితే చెరగని చరిత్ర
తేదీ: 20 -04- 1981
రక్తమోడుతున్నా గొలుసులతో కాళ్లను దవాఖాన మంచానికి కట్టేసి ఉన్న ఈ గోండు మహిళ పేరు ఇస్రుబాయి. 1981లో కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇంద్రవెల్లి నెత్తుటి ఘటన దృశ్యమిది. ఆనాటి పోలీసు కాల్పుల్లో 13మంది మృతిచెందినట్టు అధికారిక లెక్కలు చెప్తుంటే, 60మంది వరకు మృతిచెందినట్టు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాటి ఘటనలో ఇస్రుబాయిని ఇలా రక్తమోడేలా కొట్టి, కాళ్లిరిగి కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను ఇలా గొలుసులతో బంధించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కొద్దిరోజులకే ఆమె మృతిచెందింది. ఇదే కాంగ్రెస్ ఇప్పుడు తానేదో ఆదివాసీల ఆత్మబంధువు అన్నట్టుగా మాట్లాడుతున్నది. ఆరు దశాబ్దాల పాలనలో ఏనాడూ వారి సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్.. పోడుభూములకు పట్టాలిచ్చేందుకు మనసురాని కాంగ్రెస్.. ఇప్పుడు హామీల డ్రామాలాడుతున్నది.
తేదీ: 30 -06- 2023
జల్..జంగల్.. జమీన్.. నినాదంతో శతాబ్దానికి పైగా పోరాడుతున్న ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. తండాను, గూడేన్ని పంచాయతీలుగా మార్చి.. మావ నాటే మావ రాజ్ (మా తండాలో మా రాజ్యం) నినాదాన్ని నిజం చేసి చూపించింది. గిరిపుత్రులకు బలమైన గొంతుకను ఇచ్చేందుకు గిరిజన రిజర్వేషన్లను పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందిస్తూ లక్షా 50వేల మంది గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు పూయిస్తున్నది. జూన్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ ప్రారంభం కాగా.. అన్ని జిల్లాల్లో హక్కుపత్రాలను అందిస్తున్నది. ఇదికదా ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడటం! వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమెత్తు నిలబెట్టడం! ఇదికదా కొత్త చరిత్రను లిఖించడం.