హైదరాబాద్, నవంబర్10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీల హోదాకే ఎసరు తెచ్చేలా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనార్టీలకు ఏదో కిరీటం పెడతామన్నట్టుగా ప్రకటించిన ఈ డిక్లరేషన్ వల్ల ఇటు మైనార్టీలు, అటు బీసీలు కూడా తీవ్రంగా నష్టపోతారని ఈ రెండువర్గాల మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు వంటి వర్గాలను రాజ్యాంగం మతపరమైన మైనార్టీలుగా గుర్తించిందని, ఇప్పుడు మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ కుల గణనతో ముడిపెట్టడం వల్ల తమ మైనార్టీ హోదాకే ప్రమాదం వాటిల్లుతుందని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కుల గణనతో మతపరమైన మైనార్టీలకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ సంస్థ భావజాలంతోనే ఈ డిక్లరేషన్ను రూపొందించారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు..
రైతు డిక్లరేషన్ను రాహుల్గాంధీ, యువజన డిక్లరేషన్ను ప్రియాంకగాంధీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను సోనియాగాంధీతో విడుదల చేయించిన కాంగ్రెస్ పార్టీ.. మైనార్టీ, బీసీ డిక్లరేషన్ను మాత్రం వారితో విడుదల చేయించలేదని ఆయా వర్గాల మేధావులు నిలదీస్తున్నారు. ముస్లింల మధ్య కూర్చోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు అనుకూలమని ప్రకటించిన రాహుల్ గాంధీ, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును క్లియర్ చేయాలని ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణపై కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ముస్లిం మతపెద్దలు, మేధావులు మండిపడుతున్నారు. విశాఖపట్టణంలోని దర్గా హజ్రత్ ఇషాక్ మదానీ అవ్లియా ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసి, బోర్డుకు భారీ నష్టం కలిగించిన ఖుస్రో పాషా, ఇతరులపై గతంలో సీఐడీ 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని, అలాంటి వ్యక్తిని కూడా మైనార్టీ డిక్లరేషన్ రూపకల్పన కమిటీలో కాంగ్రెస్ పెట్టిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చదని మండిపడుతున్నారు.
జహాన్ కాంగ్రెస్.. వహన్ దంగా..
కాంగ్రెస్ ఎక్కడ గెలిస్తే అక్కడ మత హింస సంసృతిని ప్రారంభిస్తుందని ముస్లిం మేధావివర్గం నిప్పులు చెరిగింది. 1950-1995 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 1,194 మతపరమైన అల్లర్లు జరిగితే.. వాటిలో 72.95% నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడే జరిగాయని వివరించారు. 1967-2002 మధ్య దేశమంతటా 18 పెద్ద మతపరమైన అల్లర్లు చెలరేగగా.. అందులో 10 ఘటనలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనే జరిగాయని చెప్తున్నారు. నెహ్రూ పాలనలో – 16 రాష్ట్రాల్లో 243, ఇందిరాగాంధీ పాలనలో 15 రాష్ట్రాల్లో 337 అల్లర్లు, రాజీవ్గాంధీ పాలనలో 16 రాష్ట్రాల్లో 291 అల్లర్లు జరిగాయని వెల్లడించారు. యూపీఏ 1, 2 పాలనలో 2005-2012 మధ్య 5,821 అల్లర్లు చెలరేగగా.. 943 మంది ప్రాణాలు కోల్పోయారని, 18,513 మంది గాయపడ్డారని తెలిపారు. 1984, 1990, 1992, 1993లో జరిగిన అల్లర్లను హైదరాబాద్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని ముస్లిం మేధావివర్గం పేర్కొంటున్నది.
బీఆర్ఎస్తో మైనార్టీల అభ్యున్నతి
తెలంగాణలో బీఆర్ఎస్తోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యమని ముస్లిం మేధావి వర్గం అంటున్నది. తెలంగాణలో 50 లక్షల జనాభాకు 2014-15లో 1,030 కోట్లతో బడ్జెట్తో ప్రారంభించి, 2023-24లో బడ్జెట్ 2,200 కోట్లకు పెంచిందని గుర్తుచేసింది. మైనార్టీ పిల్లల విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు అందిస్తున్నదని, ఇప్పటికే 17,000 మంది ఇమామ్లు, మౌజమ్కు గౌరవ వేతనం అందిస్తున్నదని పేర్కొన్నది. హామీ ఇవ్వకున్నా 205 రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేసి ఏటా 1,32,000 మంది పేద మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని, త్వరలోనే డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామని హామీ కూడా ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వక్ఫ్ ఆస్తుల్లో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని ముస్లిం మేధావివర్గం, మతపెద్దలు తేల్చిచెప్తున్నారు.
బీసీలకూ నష్టమే..
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ను ఇటీవలను ప్రకటించింది. అందులో ప్రధానంగా కుల గణనను నిర్వహించి మైనార్టీలతో సహా అన్ని వెనకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనిపై ముస్లిం మేధావులు మండిపడుతున్నారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు కుల గణనతో ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సికులు మతపరమైన మైనార్టీలని, ఆ హోదాను భారత రాజ్యాంగమే కల్పించిందని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్-సిద్ధాంతాల ప్రభావంతో ఆ హోదాను తొలగించే కుట్రకు పూనుకొన్నదని మండిపడుతున్నారు. మైనార్టీలను ఓబీసీల్లో చేర్చితే మైనార్టీలతోపాటు తాము కూడా నష్టపోతామని బీసీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలను 2006-07 నుంచి బీసీ ఈలో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నారని, అయితే ముస్లింలంతా బీసీలని అర్థం కాదని వివరిస్తున్నారు. మైనార్టీలను బీసీలతో కలిపి లెక్కించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన మైనార్టీ హోదా పోతుందని, అది మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ అమలును సులభతరం చేస్తుందని అంటున్నారు.