హైదరాబాద్, ఫిబ్రవరి 19 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఆయన నియామకంతో పార్టీలో రేగిన చిచ్చు రోజురోజుకు తీవ్రమవుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్గాంధీకి లేఖ రాయడం, త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఇందుకు తార్కాణం. జగ్గారెడ్డికి ఎదురైన పరిస్థితిని సీనియర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు వీ హనుమంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ తదితరులు సమర్థించడం గమనార్హం. జగ్గారెడ్డి రాజీనామా అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించడంతో ఈ పంచాయితీ ఢిల్లీని తాకబోతున్నది. జగ్గారెడ్డి రాజీనామాకు దారి తీసిన పరిస్థితినే ఇంకా అనేకమంది సీనియర్లు ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటున్నట్టు వీ హనుమంతరావు పేర్కొన్నారు. తనను కూడా పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరగుతున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నాయకుడి రాజీనామా నిర్ణయాన్ని తాము ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఈ అంశాన్ని సోనియా, రాహుల్గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సాయం త్రం ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీకి వెళ్లడానికి ముందు జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ కి, పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు. రాజీనామాల పర్వం జగ్గారెడ్డికే పరిమితం కాదని, పార్టీని వీడేందుకు పలువురు నాయకులు సమయం కోసం వేచి చూస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
జగ్గారెడ్డికి బుజ్జగింపులు
రాజీనామా ప్రకటనతో జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు పలువురు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ రాష్ట్ర వ్యవహారాలు చూసే ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసరాజు, బోసురాజుతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క, జే గీతారెడ్డి, హనుమంతరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దీంతో తన రాజీనామా నిర్ణయాన్ని మూడు నాలుగు రోజులకు వాయిదా వేసుకున్నారు. తన పార్టీ సీనియర్లందరికీ నచ్చజెప్పి రాజీనామా చేస్తానని వెల్లడించారు. రేవంత్రెడ్డి కూడా ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా జగ్గారెడ్డి అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. రెండుమూడ్రోజుల్లో రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జగ్గారెడ్డి రాజీనామాపై రేవంత్రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనిని టీ కప్పులో తుఫానుగా వర్ణించారు.
కాంగ్రెస్కు రాజీనామా చేస్తా
రేవంత్రెడ్డికి పార్టీని నడపడం రాదు
సోనియా, రాహుల్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. తనపై కొంతమంది వేసిన కోవర్టు ముద్రను భరించలేక ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. రాజీనామా అనంతరం అసలైన రాజకీయం చూపిస్తానని పరోక్షంగా రేవంత్రెడ్డికి హెచ్చరికలు జారీచేశారు. రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్గాంధీకి శనివారం లేఖ రాశారు. ఆ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడు తూ… లేఖ రాసిన మరుక్షణం నుంచి కాంగ్రెస్ గుంపులో లేనని పేర్కొన్నారు. ఏ పార్టీలోనూ చేరబోనని, అవసరమైతే కొత్త పార్టీ పెడతానని చెప్పారు. రాహుల్గాంధీని అస్సాం సీఎం వ్యక్తిగతంగా విమర్శిస్తే వెంటనే స్పందించిన తానా, ఒకరోజు ఆలస్యంగా స్పందించినవారా? కోవర్టు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావొచ్చునని, రేవంత్రెడ్డి పార్టీని నడపడం రావడం లేదని విమర్శించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి, వన్మ్యాన్ షో చేయడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపొద్దా? అని ప్రశ్నించారు.