Telangana | హైదరాబాద్ : సచివాలయం వేదికగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పేదలపై భారం తగ్గించాలని రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మండల కార్యాలయాల్లోకి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చు అని సీఎం సూచించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, ఇవాళ మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించామని తెలిపారు.