మనసులో తడి ఉన్న మనిషి మాత్రమే
మట్టినీ తపనతో ‘తడి’మి చూడగలడు!
మహీతలానికో, మానవాళికో
మంచి చేయాలన్న మహా సంకల్పం
కలిగినప్పుడు మాత్రమే అవతరిస్తుంది…
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హరిత నిధి పథకం ఇదే… ఇలాంటిదే! తను జన్మించిన ఇల, తనకు జన్మనిచ్చిన నేల… వేలవేల ఏండ్లు పచ్చగా పసిడి కాంతులతో పరిఢవిల్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నంలో మరో మేలు మలుపు హరిత నిధి.
వలస పాలనలో అడవులు ఎడారులై, చెరువులు నెర్ల్రై, వాగులు పర్రలై, పొలం బీడై, చెట్టు మోడై, నీడ ఎండై… జీవ నదులు కూడా నిర్జీవంగా మారి… గుక్కెడు తాగు నీటి కోసం ఎండిన గొంతుక ఆర్వో బాటిల్తో గుటకవేయలేక ఇరుక్కుపోయిన వలస పాలనలో… తెలంగాణ సగటు జీవి బతుకు కరువుకు కాటకానికి మధ్య లోలకంగా ఊగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్… 2015లో హరితహారం పథకాన్ని ప్రారంభించారు. కనిపించిన ప్రతి చోటా మొక్కలు నాటించి పుడమి తల్లికి పచ్చలహారం తొడిగారు. మురిసిన భూమి తల్లి ముచ్చటపడి ఇస్తున్న వరమో, పచ్చబడిన భూమిపై వరుణ దేవుడి పరవశమో… తెలియదుగానీ తెలంగాణలో గత మూడు నాలుగేండ్లుగా సమృద్ధిగా వానలు పడుతున్నాయి. మొక్క మొక్కకూ కొత్త మొలకలు పుట్టి నిండుగా చిలకలు వాలుతున్నాయి. చెలకలు చిగురిస్తున్నాయి.
మొక్క ఎదుగుదల ఒకనాటితో ఆగుతుందా?పచ్చబడిన చెట్టు తన ప్రయత్నం ఆపుతుందా? హరిత ఉద్యమం కూడా ఇక్కడితో ఆగ కూడదు కదా!
ఆ ముందడులో భాగమే హరితనిధి!
నిధి విత్తనం, జన చైతన్యమే వట వృక్షం.. పచ్చటి తెలంగాణకు కొత్త సంకల్పం
ముందే విపక్ష నేతలకు సీఎం ఫోన్.. సభలో భట్టి వద్దకు స్వయంగా కేసీఆర్
ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగ సంఘాలతో చర్చించి హరిత నిధిలో భాగస్వామ్యం
మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిధి పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి
దేశానికి, రాష్ర్టాలకు హరిత నిధి ఆదర్శం.. తెలంగాణలో పచ్చదనపు ఉద్యమం
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పచ్చని వనహారంగా మారిన హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ హరిత నిధిని (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొంటున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ మరింతగా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో హరితహారం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్యక్రమంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని చెప్పారు. హరితహారంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటికే 239 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. రాష్ట్రంలోని అడవుల్లో వందకోట్ల మొక్కలు అభివృద్ధి చెందేలా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. శాసనసభలో శుక్రవారం హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో హరిత ఉద్యమం నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వాతావరణం పరంగా వస్తున్న సమస్యల దృష్ట్యా చూసినా, మనకు మంచి వర్షాలు పడాలన్నా, కాలుష్యం తగ్గాలన్నా హరితహారం నిరంతర ప్రక్రియగా సాగాలి. పచ్చదనంపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. మరింత పెరగాలి. ఈ ఉద్యమం కొనసాగాలంటే నిరంతరం నిధుల లభ్యత ఉండాలి. ప్రభుత్వాల ప్రాధమ్యాలను బట్టి బడ్జెట్లో ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ నిధులు వస్తయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కో సంవత్సరం రూ.50 కోట్లు కూడా దొరికేవి కాదు. కొన్నిసార్లు అటవీశాఖ నుంచి 150 కోట్లు వస్తే కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాటి వల్లనే ఈ పరిస్థితి సంభవించింది. దీనిని నివారించాలంటే విద్యార్థులు, ఎన్జీవోలు, అధికారులు, సమాజం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. ఇందుకోసం తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నా. ఇందులో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషిస్తారు.
ప్రతి నెలా ప్రజాప్రతినిధుల వేతనాల్లో..
రూ.500 ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రూ.100 జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు
రూ.50 మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీపీ, జడ్పీటీసీలు
రూ.10 మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్లు
రూ.100 ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు
రూ.25 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి
0.1%ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్ తదితర కాంట్రాక్టు నిధుల్లోంచి
10% నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి
రూ.50 ప్రతి రిజిస్ట్రేషన్ నుంచి
రూ.1000 వ్యాపార సంస్థల ప్రతి లైసెన్సు రెన్యువల్ నుంచి
రూ.10 ప్రతి సూల్ అడ్మిషన్కు
రూ.15 ఇంటర్మీడియట్ అడ్మిషన్కు
రూ.25 డిగ్రీ అడ్మిషన్కు
రూ.100 ప్రొఫెషనల్ కాలేజీ అడ్మిషన్కు
మనదేశంలో అటవీ రంగం అత్యంత నిరాదరణకు గురై, పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడోరోజే పర్యావరణ పరిరక్షణపై మేధావులు, అధికారులతో సమీక్షించిన. పర్యావరణం ప్రాధాన్యం గుర్తించి ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించిన. సోషల్ ఫారెస్ట్ ఎంత పెంచినా, పది నుంచి ఇరవై ఎకరాల అడవికి సమానం కాదని, అడవిలో ఉండే బయోడైవర్సిటీ ఇతర పద్ధతుల్లో రాదని నిపుణుల ద్వారా తెలిసింది. అనంతగిరి అడవుల్లోని ఎన్నో ఔషధ మొక్కలపై నుంచి ప్రవహించి వచ్చే నీరు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లోకి వస్తుండేవి. అందుకే హైదరాబాద్లోని నీళ్లకు అంతటి శ్రేష్ఠత ఉండేది. తెలంగాణకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి 2.75 కోట్ల ఎకరాల భూభాగం. అటవీశాఖ ప్రకారం ఇందులో 66.25 లక్షల ఎకరాల పైచిలుకు అటవీ భూములున్నాయి. గతంలో అనేక ప్రాంతాల్లో అద్భుతమైన అటవీ సంపద ఉండేది. ఇందల్వాయి ఘాట్ రోడ్డు దగ్గర దట్టమైన అడవిలో దోపిడీ దొంగల భయం ఉండేది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి. ఇలాంటి అడవుల పునరుజ్జీవం కోసం నిపుణుల సూచనలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం.
అడవుల్లో 20 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. భూమిలో నిక్షిప్తమై ఉన్న చెట్ల వేర్ల ద్వారా 80 కోట్ల మొక్కలను పునరుజ్జీవింపచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. మొత్తంగా వందకోట్ల మొక్కలు అటవీ ప్రాంతాల్లో కొత్తగా పెరిగేలా చర్యలు తీసుకొంటున్నాం. ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటినం. మరో 42.42 కోట్ల మొక్కలను వేర్ల ద్వారా పునరుజ్జీవింపజేసినం. పీసీసీఎఫ్గా శోభ అంకితభావం, అటవీశాఖ అధికారుల కృషితో గజ్వేల్లోని 35 వేల ఎకరాల అటవీభూమిలో మొక్కలు నాటాం. ఆ అడవిలో ఇప్పుడు బయోడైవర్సిటీ పెరిగింది. నెమళ్లు, అడవిపందులు ఇతర జంతుజాలం అందులోకి వచ్చింది. నిర్మల్లోనూ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో అడవుల పునరుద్ధరణ బాగా జరుగుతున్నది. అడవుల బయట జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి ప్రాంతాల్లో పదికోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 14.5 కోట్ల మొక్కలు నాటినం. సోషల్ ఫారెస్ట్, రెవెన్యూ ప్లాంటేషన్ వంటివాటి కింద 120 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకొంటే 162.77 కోట్ల మొక్కలు నాటినం. లక్ష్యాలకు మించి హరితహారం విజయాలు సాధిస్తున్నది. 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం ప్రారంభించి 239 కోట్ల వరకు మొక్కలు నాటాం.
అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం తలసరి చెట్లు అధికంగా ఉన్న దేశం కెనడా. చైనాలోని ఓ ఎడారి కారణంగా ఏటా ఇసుకమేటలతో వ్యవసాయానికి అవరోధం ఏర్పడుతుండటంతో, దానిని అడ్డుకొనేందుకు గ్రేట్ గ్రీన్వాల్ ఆఫ్ చైనా పేరిట 1978 నుంచి 2050 వరకు ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 5 వేల కిలోమీటర్ల పొడవున, వేల కోట్ల మొక్కలు నాటేందుకు జరుగుతున్న ఈ కార్యక్రమం మనందరికీ ఆదర్శం. అడవుల పెంపకంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. బ్రెజిల్లో రెండో అతిపెద్ద ప్రయత్నంగా అమెజాన్ అడవులను పరిరక్షించుకొంటున్నారు. వీటిని ఐరాస గుర్తించింది. అదేవిధంగా తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో మూడో అతిపెద్ద ప్రయత్నంగా గుర్తించారు. న్యూజీలాండ్లో ఒక రాజకీయ పార్టీ పేరే ‘గ్రీన్పార్టీ’ అని ఉన్నది. గ్రీనరీ ప్రమోషన్ మీదనే దాని కార్యకలాపాలు ఉంటాయి. ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ పార్టీ చొరవ కారణంగా ప్రపంచంలోనే ఉత్తమ పర్యావరణ పరిస్థితులు ఉన్న దేశంగా న్యూజీలాండ్ పేరు పొందుతున్నది.
ప్రమోషన్ ఆఫ్ గ్రీనరీలో భాగంగా మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతి వనాల కోసం 526 మండలాల్లో స్థలాల్ని గుర్తించాం. 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు జరుగుతున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పెంపులో భాగంగా 109 ఏరియాల్లో 75,740 ఎకరాల్లో అర్బన్ పార్కు లు ఏర్పాటుచేస్తున్నాం. ఇండియాలోనే హైదరాబాద్ నగరం బెస్ట్ లివబుల్, లవబుల్ సిటీ. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల వల్ల రియల్ ఎస్టేట్ విపరీతంగా పుంజుకొన్నది. ఏటా అనేక లక్షల చదరపు అడుగులమేర భవనాలు వస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ వస్తున్నది. నగరాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నది. పెద్దపెద్ద ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికితే రూ.4 లక్షల జరిమానా విధించాము. లేఔట్లలో గతంలో ఖాళీ జాగాలు అమ్ముకునేవారు. ఇప్పుడు వాటిల్లో వెంటనే మొక్కలు నాటేలా చర్యలు తీసుకొంటున్నాం. హైదరాబాద్ చుట్టూ 188 రిజర్వు ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి చేస్తున్నాం. నగరం చుట్టూ 1,60,661 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్, గోడలు ఏర్పాటు పనులు జరిగాయి. హెచ్ఎండీఏ ద్వారా వందలకోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ కూడా అద్భుతమైన ప్లాంటేషన్ వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నేషనల్ హైవే కలిపి దాదాపు 1,00,156 కి.మీ. రోడ్లున్నాయి. ఇందులో 82,491 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది. పంచాయతీరాజ్లో 59 వేల కిలోమీటర్లు, ఆర్అండ్బీలో 865 కిలోమీటర్ల మేర మొక్కలు నాటగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేల వెంట మొక్కలు నాటుతున్నారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ యాక్టుల్లో 10% గ్రీన్బడ్జెట్ పెట్టినం. పంచాయతీలకు రూ.415.47 కోట్లు, జీహెచ్ఎంసీ సహా పట్టణాభివృద్ధి సంస్థలకు రూ.841 కోట్లు కేటాయించాం. వీటితో అర్బన్ పార్కులు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంట్రాస్ట్రీట్ ప్లాంటేషన్ వంటివి ఏర్పాటుచేస్తారు. నాటిన మొక్కలు 85-95% వరకు బతుకుతున్నాయి. చనిపోయిన మొక్కలను రీప్లేస్ చేసేందుకు గ్రామీణ నర్సరీలు ఏర్పాటుచేశాం. మొక్కలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు గ్రామా ల్లో ఆకస్మిక తనిఖీలు చేయండి. మాకు సమాచారం ఇవ్వండి. నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ముందు తరాల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి హరితహారం మొక్కల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మూడు నాలుగేండ్లుగా ప్రకృతి మనకు సహకరిస్తున్నది.
ధరణితో చాలా భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. భూముల సమగ్ర సర్వే చేస్తామని గతంలో ప్రకటించినం. బడ్జెట్ కూడా కేటాయించినం. సర్వే సంస్థల ప్రతినిధులను పిలిచి మాట్లాడినం. దురదృష్టవశాత్తూ కరోనా సెకండ్వేవ్ వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. సర్వేను అతి త్వరలో మళ్లీ ప్రారంభిస్తాం. ఈ అంశంలో నేను కమిటెడ్గా ఉన్నా. అధునాతన టెక్నాలజీ ఉన్నది కాబట్టి అనుకున్నదానికన్నా తొందరగా పూర్తయ్యే ఆస్కారం ఉంటుంది. సమగ్ర సర్వే పూర్తయితే దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, కబ్జాలు అన్నీ బయటపడతాయి.
చెట్లు కొట్టడమే తప్ప పెట్టడం మర్చిపోయిన జనాలకు వనాల ప్రాధాన్యం తెలియజేయాలనే ఉద్దేశంతో 19,472 ఆవాసాల్లో నేడు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశాం. అన్ని నియోజకవర్గాల్లో అటవీ భూములున్నాయి. ప్రతి ఎమ్మెల్యే మీ పరిధిలో అటవీ ప్రాంతం ఎంత ఉన్నది? ఎంత మేరకు చెట్లు నాటారు? అనే అంశాలపై దృష్టి పెట్టండి. మనం ఇక్కడ ఎంత చేసినా క్షేత్రస్థాయిలో సర్పంచ్లే కష్టపడాల్సి ఉంటుంది. హరితహారం విషయంలో సర్పంచులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. చెప్పినదానికన్నా ఒక అడుగు ముందుకేసే పని చేశారు. పల్లె ప్రకృతి వనాలను చక్కగా తీర్చిదిద్దారు. నడవడానికి అవసరమైన బాటలు, కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు, పిల్లలు ఆడుకొనేందుకు ఆట వస్తువులు ఏర్పాటుచేశారు. ఇది చాలా సంతోషం కలిగించే వార్త.