హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంవంటి వేడుకలు నిర్వహించడం వల్ల భావితరాలకు మన సంస్కృతీ, ఉద్యమచరిత్ర తెలుస్తాయని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను, త్యాగాలను గౌరవించుకోవడం, వివిధ దేశాల్లో సంఘాలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం(ఈటీసీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అజ్మాన్లోని హ్యాబిటెట్ సూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
వేడుకలకు వీ ప్రకాశ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2011 నుంచి ఈటీసీఏ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన అభినందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని వివరించారు. ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్కుమార్ పీచర మాట్లాడుతూ.. ఆవిర్భావ వేడుక దశాబ్దాల పోరాటాన్ని, వేలమంది త్యాగాలను స్మరించుకొనే గొప్పరోజని అన్నారు. ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్సార్ ఆశయాలను, మలిదశ ఉద్యమాన్ని అకుంఠిత దీక్షతో నడిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
కేసీఆర్ అలుపెరుగని పోరాటం, దూరదృష్టి నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన తెలంగాణ ప్రముఖుల వేషధారణలు, మహిళల నృత్యాలు, వినోద్-విపుల దంపతుల సిట్, గాయకుడు మల్లేశ్ కోరేపు ఆలపించిన విప్లవ గీతాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో ఈటీసీఏ మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అలిగేటి, జాయింట్ సెక్రటరీ శేఖర్గౌడ్, కోశాధికారి తిరుమల్రావు, కల్చరల్ సెక్రటరీ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.