హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వెంట నే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ను ఆదేశించారు. ములుగు జిల్లా ఎస్పీ గౌస్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకొని.. సరైన ఆధారాలు లభించిన వారి పేర్లను ప్రకటించాల్సిందిగా డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఉపా కేసు వాస్తవాలు, ప్రస్తుత దర్యాప్తుపై రిజాయిండర్ను ఎస్పీ జారీ చేశారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నేతృత్వంలో రాష్ర్టానికి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులు, ఇతర మావోయిస్టులు, మిలీషియా సభ్యులు సమావేశమై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు పథకం పన్నారని పేర్కొన్నారు.
దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించగా.. సాక్షుల వాంగ్మూలాలతోపాటు మరిన్ని ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ జరిపిన విచారణలో ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా, వీ రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్కుమార్ ప్రమేయానికి సంబంధించి తగిన ఆధారాలు లభించలేదని ఎస్పీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు మెమో ద్వారా దాఖలు చేసి, కేసు నుంచి పై ఆరుగురి పేర్లను తొలగించాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు.
సీఎం నిర్ణయం హర్షనీయం: సీపీఐ నేత నారాయణ
హరగోపాల్తోపాటు 152 మందిపై ఉపా కేసు నమోదు చేయడాన్ని పలు పార్టీలు వ్యతిరేకించాయని, ఈ కేసు ఎత్తివేత విషయంలో స్వయంగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడాన్ని హర్షిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కేసును వెనకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.