విమానాల రద్దుతో అక్కడే ఆగిపోయిన కరీంనగర్, మంచిర్యాల వాసులు
మంచిర్యాల టౌన్/గంగాధర, ఆగస్టు 18: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్లో ఇద్దరు తెలంగాణవాసులు చిక్కుకున్నారు. ఉపాధి కోసం అఫ్గాన్ వెళ్లిన కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాకేంద్రానికి చెందిన బొమ్మెన రాజన్న ఎనిమిదేండ్ల క్రితం కాబూల్లోని అమెరికా మిలటరీ సంస్థ ఏసీసీఎల్లో ఆఫీస్ అసిస్టెంట్గా చేరారు. ఈ ఏడాది జూన్ 28న మంచిర్యాలకు వచ్చి.. ఈ నెల 7న తిరిగి కాబూల్కు వెళ్లారు. ఇంతలోనే తాలిబన్లు కాబూల్ను వశపరుచుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమానాల్లేక రాజన్న అక్కడే తల దాచుకున్నట్టు తెలుస్తున్నది. రాజయ్యను ఇంటికి చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన భార్య వసంత, కుమార్తె రమ్య విజ్ఞప్తిచేశారు. కాగా, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన పెంచాల వెంకటయ్య పదేళ్లుగా కాబూల్లోని ఓ కంపెనీలో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ.. ప్రస్తుతం అక్కడే చిక్కుకున్నాడు. ప్రభుత్వం వెంకటయ్యను క్షేమంగా ఊరికి చేర్చాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు, టీఆర్ఎస్ నేత సలువాజి విద్యాసాగర్రావు విజ్ఞప్తిచేశారు.