111 జీవో గ్రహణంతో రెండున్నర దశాబ్దాలకు పైగా అభివృద్ధి అందని ద్రాక్షగా మారిన 84 గ్రామాల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొన్నది. జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ గురువారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం లక్షలాది కుటుంబాల్లో సంతోషం నింపింది. జీవో 111 రద్దుతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిధిలోని లక్షా 32వేల 600 ఎకరాల భూమి దశ మారనున్నది. ఈ భూముల్లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కూడా విస్తరించనున్నాయి.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం 1996లో 111 జీవోను తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం కృష్ణా, గోదావరి, మంజీర, సింగూరు నుంచి పుష్కలమైన నీరు అందుబాటులో ఉన్నందున తాగునీటికి ఆ జంట జలాశయాలు అవసరం లేకుండా పోయింది. కాళేశ్వర జలాలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, మూసీ పరిరక్షణకు మార్గం సుగమం కానున్నది.
Telangana Cabinet | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలోని వీఆర్ఏలను (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, వీఆర్ఏల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను ఆదేశించించింది. హిమాయత్సాగర్, గండిపేట, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు గోదావరి జలాలను తరలించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మైనారిటీ కమిషన్లో జైనులకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకొన్నది. గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి హరీశ్రావు మీడియాకు వెల్లడించారు. వీఆర్ఏలందరినీ రెవెన్యూ శాఖలోనే ఉంచడం సాధ్యం కాదని, కొందరిని ఇతర శాఖల్లోకి తీసుకొంటామని తెలిపారు. ఏయే శాఖల్లోకి ఎంత మందిని తీసుకోవాలో త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.
జీవో 111ను పూర్తిగా ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ చుట్టపక్కల 84 గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇకపై హెచ్ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాలకు ఉన్న నిబంధనలు, విధివిధానాలే ఈ 84 గ్రామాలకు వర్తించనున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే శంకర్పల్లి-చేవెళ్ల రహదారిని 150 నుంచి 200 అడుగుల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా గ్రామాలకు రవాణా వసతి మెరుగుపడనున్నది. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం 1996లో 111 జీవోను తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం కృష్ణా, గోదావరి, మంజీర, సింగూరు నుంచి పుష్కలమైన తాగునీటి వనరులు ఉన్నందున జంట జలాశయాల నుంచి తాగునీటి అవసరం లేకుండా పోయింది. 111 జీవో ద్వారా 84 గ్రామాల పరిధిలోని భూముల్లో పది శాతంలోనే శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఉన్నది. 60 శాతం మేర ఓపెన్ స్పేస్, రోడ్లను వేయాల్సి ఉంటుంది. 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాలు వ్యవసాయ, వినోద (రెసిడెన్షియల్, రిక్రియేషన్) జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొన్నది. జీవో ఎత్తివేతతో నగరాభివృద్ధిలో ఈ 84 గ్రామాలు కూడా కొత్తగా భాగస్వామ్యం కానున్నాయి. ఈ భూముల్లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కూడా విస్తరించనున్నాయి.
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం వారి వివరాలను సేకరించింది. వీఆర్ఏల్లో వంశపారంపర్యంగా పనిచేస్తున్నవారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైనవారు ఉన్నారు. నిరక్ష్యరాస్యులు మొదలు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా వారి సేవలను వినియోగించుకోవాలి? వారి విద్యార్హతలు ఏమిటి? ఏయే శాఖల్లోకి తీసుకోవచ్చు? వంటి అంశాలపై ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,046 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైనవారు 2,783 మంది ఉన్నారు.
హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రింగ్ మెయి న్ పైప్లైన్తోపాటు కలుషితాలు చేరకుండా ఎస్టీపీల నిర్మాణం చేపట్టనున్నారు. హిమాయత్సాగర్, గండిపేట జలాశయాలతోపాటు మూ సీ నదిని సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్తో అనుసంధానించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అక్కడి నుంచి కాళేశ్వరం జలాలను ఈ జలాశయాలకు తరలించనున్నారు. దీంతోపాటు హైదరాబాద్లోని హుస్సేన్సాగర్కు కూడా గోదావరి నీటిని తరలించాలని క్యాబినెట్ నిర్ణయించింది. హుస్సేన్సాగర్ను శుద్ధి చేసే చర్యల్లో భాగంగా గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తద్వారా మురుగు నీటిని బయటికి పంపి, శుభ్రమైన జలాలతో హుస్సేన్ సాగర్ను నింపేందుకు అవకాశం కలుగనున్నది. చారిత్రక నగరంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండ పోచమ్మసాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాల్వ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాల్వ 27వ కిలోమీటర్ వద్ద హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించే ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి కాల్వ గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యం 5,054 క్యూసెక్కులు కాగా, ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించారు. మిగిలిన 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వరజలాల్ని సమీపంలో ఉన్న రావిల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వ లేదా పైపులైను ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్సాగర్కు వస్తాయి. ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరజలాలతో నిండుగా ఉండనున్నాయి. జంట జలాశయాల పరీవాహక ప్రాంతం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్లోకి అనుసంధానంగా ఉన్న బుల్కాపూర్ నాలా ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి.
రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన మతం వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జైనుల నుంచి ఒకరిని మైనార్టీ కమిషన్లో సభ్యులుగా ఎంపిక చేయనున్నారు. ప్రస్తు తం కమిషన్లో 8 మంది సభ్యులు ఉండగా, ఇకపై 9 మంది ఉంటారు. తెలంగాణ ప్రభు త్వం రాష్ట్రంలో అన్నివర్గాలకు సముచిత ప్రాధా న్యం ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మందికి పైగా జైనులు ఉన్నారు. తమకు సముచిత గౌరవం కల్పించాలని వీరు ఎంతో కాలంగా కోరుతూ వస్తున్నా రు. ఈ క్రమంలో వారికి అండగా నిలుస్తూ… ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది.