హైదరాబాద్: ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుని అల్లాడిన తెలంగాణ వ్యవసానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ అసాధారణ కృషితో నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవరించిందని చెప్పారు. మంత్రి హరీశ్ రావు శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023-24కుగాను రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.6385 కోట్లు, రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు, ఆయిల్పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు రూ.7994 కోట్ల నిధులు ఖర్చు చేశాయని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 జనవరి నాటికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు వెచ్చించిందని చెప్పారు. అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చుచేసిందన్నారు. దేశ వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం కాగా, తెలంగాణలో అది 7.4 శాతంగా ఉందని చెప్పారు. 2014-15లో రాష్ట్రంలో మొత్తం పంటసాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు ఉండగా, ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందని చెప్పారు. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22లో 2కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు.
75 ఏండ్ల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల భారీ మొత్తాన్ని పంటపెట్టుబడి సాయంగా అందించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందన్నారు. రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమా అందిస్తున్నదని వెల్లడించారు. ఏ రైతైనా మరణిస్తే.. మరణించిన నాటినుంచి 10 రోజుల్లోగా రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు లక్ష మంది రైతుల కుటుంబాలకు రైతుబంధు ద్వారా రూ.5384 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. రైతు పండించిన ప్రతిగింజా ప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నదని ప్రకటించారు.
ఆయిల్పామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయిల్పామ్ సాగుద్వారా ప్రతి ఎకరానికి రూ.లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వస్తుందన్నారు. అందువల్ల రాష్ట్రప్రభుత్వం ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.