హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రూ.200 పింఛన్ను తెలంగాణ సర్కార్ రూ.2016కు, దివ్యాంగులకు రూ.3016కు పెంచింది. ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు కూడా నెలకు రూ.2016 అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
2014లో 29,21,828 మందికి పింఛన్లు ఇస్తుండగా.. వారికి ఏటా రూ.861 కోట్లు ఖర్చయ్యేవని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 44,12,882 మందికి పెంచిందన్నారు. దీంతో ప్రభుత్వం ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు రూ.54,989 కోట్లు అందించిందన్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన విధంగా 57 ఏండ్లు నిండిన వారికి కూడా పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. దీంతో 8,96,592 మంది లబ్ధిదారులు కొత్తగా చేరారని వెల్లడించారు.