హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కోట్లు, పౌరసరఫరాలశాఖకు రూ. 2,899.85 కోట్లు కేటాయించింది. రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, గొర్రెల పంపిణీ, రేషన్ బియ్యం తదితర పథకాలకు నిధులు కేటాయించింది. గొర్రెల పంపిణీ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులు చర్యలుచేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికే 3.88 లక్షల మంది లబ్ధిదారులకు 81.60 లక్షల గొర్రెలను పంపిణీచేసింది. రేషన్ బియ్యం సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.2,787 కోట్లు కేటాయించింది. పౌరసరఫరాలశాఖకు గతేడాది 2,363 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.536.85 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం.పశు సంవర్ధక శాఖకు గతేడాది రూ. 1,038.68 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.1,730 కోట్లకు పెంచింది. ఇది గతేడాది కంటే రూ.1,038.68 కోట్లు అధికం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.17.50 కోట్లు కేటాయించింది.
రైతుబంధు పథకానికి 2022-23 బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించింది. గత ఎనిమిది విడతల్లో ప్రభుత్వం ఈ పథకం కింద మొత్తం రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దాదాపు 63 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.
రైతుబీమా ప్రీమియం చెల్లింపుల కోసం రూ.1,466 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఇది రూ.266 కోట్లు ఎక్కువ. రైతుబీమా కింద ప్రభుత్వమే ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నది. రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేస్తున్నది. 2021-22లో 35.64 లక్షల మంది రైతుల కోసం ఎల్ఐసీ ప్రీమియం కింద రూ.1,400 కోట్లు చెల్లించింది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన సుమారు 75 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.3,775 కోట్ల సాయం చేసింది.
ఉద్యానశాఖకు రూ.994 కోట్లు ప్రభుత్వం ఈసారి ఉద్యానశాఖకు కేటాయింపులు భారీగా పెంచింది. మునుపెన్నడూలేనంతగా రూ.994.65 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన రూ.242.30 కోట్ల కంటే ఇది 752.35 కోట్లు ఎక్కువ. రైతులను వరి పంట నుంచి ఇతర పంటల సాగు వైపు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్యానశాఖకు అధిక కేటాయింపులు చేసింది.
కొత్త ఉద్యోగుల జీతాలకు 3 వేల కోట్లు: కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం బడ్జెట్లో రూ.3 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించింది. త్వరలో వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తిచేసి, శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించింది. వీటి భర్తీ కోసం అతి త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖలకు ఈ బడ్జెట్లో మొత్తం రూ.849 కోట్లు ప్రతిపాదించింది. టూరిజం సర్క్యూట్ అభివృద్ధిలో భాగంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్లో బోటింగ్, పార్కులు, వాటర్ గేమ్స్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, బస్వాపూర్, మిడ్ మానేరు ప్రాజెక్టులన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దనున్నది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించింది. సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు వెల్లడించారు. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. అధునాతన హంగులతో సచివాలయం రూపుదిద్దుకొంటున్నది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్శాఖకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.29,586 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో స్థానిక సంస్థలకు రూ.2,513 కోట్లు కేటాయించింది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 2022-23 బడ్జెట్లో హోంశాఖకు రూ.9,315 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.3,463 కోట్లు ఎక్కువ. పోలీసు శాఖలో సాంకేతికత వినియోగంతో పాటు శాంతిభద్రతలను మెరుగుపర్చేందుకు 7 పోలీసు కమిషనరేట్లు, 10 పోలీసు జిల్లాలు, 25 సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నది. సోమవారం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించి ఆర్థిక భరోసా కల్పించింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే రుణాల కింద రూ.650 కోట్లు, వివిధవర్గాల ప్రయాణికులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల మొత్తాన్ని ఆర్టీసీకి తిరిగి చెల్లించేందుకు రూ.850 కోట్లను కేటాయించారు. ఆర్టీసీకి బడ్జెట్లో నిధులు ప్రతిపాదించడం వరుసగా ఇది మూడోసారి.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం ఉద్యమంలా సాగుతున్న హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.932 కోట్లు కేటాయించింది. వాతావరణ సమతుల్యత కోసం సీఎం కేసీఆర్ 2015లో తెలంగాణకు హరితహారం అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిధుల కేటాయింపుపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.12,565 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.261 కోట్లు ఎక్కువ. సింగిల్ ఫేజ్ విద్యుత్తు ఉన్న గిరిజన ఆవాసాలకు రెండు మూడు నెలల్లోనే త్రీఫేజ్ విద్యుత్తును ఇస్తామని తెలిపింది.